పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల అత్యాచార ఘటనలో అక్క ఆచూకీ ఇంకా దొరకలేదు. స్పెషల్ టీంలుగా ఏర్పడిన పోలీసులు మహబూబునగర్, హైదరాబాద్ లో విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు బాధితురాలిని అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి శవాన్ని ఎక్కడైనా పడేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ చికిత్స కోసం ఈనెల 5న గాంధీలో అడ్మిట్ కాగా అతని భార్య, ఆమె చెల్లెలు సహాయకులుగా వచ్చారు. ఈనెల 8 నుంచి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అదృశ్యం కాగా, కుమారుడు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఈనెల12న డాక్టర్లకు చెప్పకుండా సదరు పేషేంట్ గాంధీ నుంచి వెళ్లిపోవడం వెనక ఏమైనా మతలబు ఉందా.. అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు నిందితులు
అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉమామహేశ్వర్, ఓ సెక్యూరిటీ గార్డ్పై సెక్షన్342,376 -డి,328 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేశారు. మంగళవారం భరోసా సెంటర్లో బాధితురాలి స్టేట్మెంట్రికార్డ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో ఉమామహేశ్వర్ను మినహా బాధితురాలు ఇంకెవరినీ గుర్తు పట్టలేదని తెలిసింది. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో అతనే సెక్యూరిటీ గార్డ్ రూంకి తీసుకెళ్లిన్నట్లు, మత్తుమందు ఇచ్చి ఇద్దరూ అత్యాచారం చేసినట్లు పేర్కొంది. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడు ఉమామహేశ్వర్ ను మంగళవారం సస్పెండ్ చేసినట్లు గాంధీ హాస్పిటల్ ఆఫీసర్లు తెలిపారు. ఘటనపై నిజానిజాలు తేల్చేందుకు మంగళవారం డిప్యూటీ సూపరింటెండెంట్నర్సింహరావు, ఆర్ఎంవో నరేందర్కుమార్, ఏఆర్ఎంపద్మ, గైనకాలజిస్ట్ హెచ్వోడీ మహాలక్ష్మీల నలుగురు సభ్యులతో కమిటీ వేశారు.
స్పెషల్టీంల ఏర్పాటు
గాంధీలో కనిపించకుండా పోయిన అక్క ఆచూకీ కనిపెట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్12 స్పెషల్టీంలను ఏర్పాటు చేసింది. వీళ్లు మహబూబ్నగర్, హైదరాబాద్ గ్రేటర్పరిధిలో గాలిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన గాంధీలోని సీసీటీవీ కెమెరాల్లో బాధిత మహిళలను గుర్తించారు. ఆ తరువాత ఇద్దరు ఎక్కడికి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్టీం ఆధారాలు సేకరించింది.
హోంమంత్రి రివ్యూ
నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, శిఖా గోయల్ తో సమీక్షా సమావేశంనిర్వహించారు. గాంధీ హాస్పిటల్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు డిమాండ్ చేశారు.