సింహానికి మేత వేయబోయి.., భయంకర వీడియో వైరల్

సింహానికి మేత వేయబోయి..,   భయంకర వీడియో వైరల్

జూలో ఉన్న ఓ తెల్ల సింహానికి ఆహారం వేయబోయిన జూ కీపర్ కి తన చేయిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ భయంకర  సంఘటన పాకిస్తాన్ లోని కరాచీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జూలో ఉన్న జంతువులకు ఆహారం అందించే క్రమంలో ఓ జూకీపర్..  బోనులో చేయి పెట్టి  అందులో ఉన్న సింహానికి మేతగా పెద్ద పిల్లి ముడి మాంసాన్ని వేశాడు. అసలే ఆకలితో ఉన్న ఆ సింహం.. మాంసంతో పాటుగా జూకీపర్ (పిరదిట్టా) చేయిని కూడా తన దవడతో అందుకుంది. అతని ఎడమ చేయిని సింహం తన పంటితో కొరికేసరికి.. ఆ నొప్పికి అతడు విలవిలలాడిపోయాడు. గట్టిగా కేకలు వేశాడు. ఆ అరుపులు విన్న తోటి ఉద్యోగులు, సందర్శకులు ఆ భయంకర ఘటనను చూశారే కానీ అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు.

దాదాపు 40 సెకన్ల పాటు సింహం అతనిపై దాడి చేసింది. దాని బారి నుండి తన చేయి విదిలించుకోవడానికి పిరదిట్టా చాలా కష్టపడి.. చివరకు రక్తసిక్తమైన గాయలతో బయటపడ్డాడు.  తీవ్రగాయాలైన పిరడిట్టాని చూసి అక్కడి సందర్శకులు భయబ్రాంతులకు గురయ్యారు. జూ సిబ్బంది వెంటనే అతన్ని అత్యవసర చికిత్స కోసం కరాచీలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.

జూ డైరెక్టర్ కమర్ అయూబ్ జరిగిన ఘటనపై మాట్లాడుతూ..ఇదొక దురదృష్టకర సంఘటన అని అన్నారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పాడు. జూ యొక్క నియమాలను పిరడిట్టా ఉల్లంఘించాడని, జంతువులకు ఎప్పుడూ ఆహారం అందించే వైపు కూడా తప్పుడు పద్ధతిలో ఆహారం వేశాడని చెప్పాడు.