- తయారీ ఫెసిలిటీల్లో లోపాలున్నాయని వెల్లడి
- సరిచేసుకునేందుకే నిర్ణయమని ప్రకటన
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ సరఫరాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సస్పెండ్ చేసింది. మార్చి 14 నుంచి 22 మధ్య సంస్థకు చెందిన వ్యాక్సిన్ తయారీ ఫెసిలిటీలను పరిశీలించామని, అందులో లోపాలున్నాయని డబ్ల్యూహెచ్వో చెప్పింది. ఆ లోపాలను సరిచేసుకునేందుకు ప్రస్తుతానికి కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అయితే, వ్యాక్సిన్ పనితనంలో ఎలాంటి లోపాలు లేవని, టీకా బాగానే పనిచేస్తోందని, ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్వో ప్రకటనపై భారత్ బయోటెక్ స్పందించింది. వ్యాక్సిన్ పనితనం, సేఫ్టీపై ఆందోళనలు అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే కొవాగ్జిన్ తీసుకున్నోళ్ల సర్టిఫికెట్లు చెల్లుబాటవుతాయని పేర్కొంది.
చైనాలో కేసులు మళ్లీ పెరుగుతున్నయ్
ప్రపంచమంతటా కరోనా కేసులు తగ్గుతున్న వేళ చైనా, బ్రిటన్, సౌత్ కొరియా వంటి పలు దేశాల్లో మాత్రం కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో ఆదివారం ఒక్కరోజే 13,146 కొత్త కేసులు నమోదయ్యాయి. షాంఘైలోనే 70% మంది బాధితులున్నారు. బ్రిటన్లో వారంలోనే 49 లక్షల మంది మహమ్మారి బారిన పడినట్టు అక్కడి అధికారులు చెప్తున్నారు. సౌత్ కొరియాలోనూ రోజూ 2 లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు.