- అధికారులపై జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణంలో అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ ఆస్తుల ఆక్రమణపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మారినా అధికారుల పనితీరులో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారడం, 8 మంది జైలు పాలవడం దేశంలో ఎక్కడా లేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. కోర్టు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలపై చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. సెట్ బ్యాక్ లేకుండా భవనాలు నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రోడ్డు మధ్యలోనే నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చూస్తూ ఊరుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బండ శంకర్, గాజుల రాజేందర్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
