సరైన కారణం లేకుండా అత్తమామల నుంచి విడివిడిగా జీవించాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వ చర్యగా పరిగణించబడుతుందని ఇటీవల ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైట్, నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా భారతదేశంలో కొడుకు వివాహం చేసుకున్న తర్వాత భార్య అతని కుటుంబం నుండి విడిపోవడం ఆచారం కాదని తెలిపింది. బలమైన, సరైన కారణం ఉంటే తప్ప, భార్య తన భర్త తన కుటుంబాన్ని విడిచిపెట్టి విడిగా జీవించాలని పట్టుబట్టకూడదని కోర్టు తెలిపింది.
తల్లిదండ్రుల విషయంలో కుమారుడికి నైతికంగా, చట్టపరంగా కొన్ని బాధ్యతలుంటాయని, వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సాధారణంగా భర్త తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి విడిపోవాలని కోరుకోడని, కానీ భార్య నిరంతరాయంగా భర్తపైకి ఒత్తిడిని తీసుకురావడం భర్త పట్ల క్రూరత్వ చర్యగా పరిగణించవచ్చని కోర్టు తెలిపింది. కుమారుడిని అతని తల్లిదండ్రుల నుండి వేరు చేయడాన్ని ప్రోత్సహించడం కంటే, వివాహం తర్వాత భార్య భర్త కుటుంబంలో భాగం కావాలని భావిస్తున్న భారతదేశంలోని సాంస్కృతిక ప్రమాణాన్ని హైలైట్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు ఉదహరించింది.