బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సౌరాష్ట్ర, విదర్భ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. విశ్వరాజ్ జడేజా (165 నాటౌట్) భారీ సెంచరీతో విజృంభించడంతో బెంగళూరులో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. ఈ వన్సైడ్ పోరులో తొలుత పంజాబ్ 50 ఓవర్లలో 291 రన్స్కు ఆలౌటైంది.
అన్మోల్ప్రీత్ సింగ్ (100) సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ ప్రభ్సిమ్రన్ సింగ్ (87), రమణ్దీప్ సింగ్ (42) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్లో ఓపెనర్ విశ్వరాజ్ దంచికొట్టడంతో సౌరాష్ట్ర 39.3 ఓవర్లలోనే 293/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. విశ్వరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక.. గురువారం జరిగిన తొలి సెమీస్లో విదర్భ 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కర్నాటకకు షాకిచ్చింది. తొలుత కర్నాటక 49.4 ఓవర్లలో 280 రన్స్కు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (76), శ్రీజిత్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ పేసర్ దర్శన్ నల్కండే (5/48) ఐదు వికెట్లతో దెబ్బకొట్టాడు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అమన్ మోఖడే (138) సెంచరీతో చెలరేగడంతో విదర్భ 46.2 ఓవర్లలో 284/4 స్కోరు చేసి గెలిచింది. రవికుమార్ సమర్థ్ (76 నాటౌట్) కూడా సత్తా చాటాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సౌరాష్ట్రతో విదర్భ పోటీపడనుంది.
