చైనాలో ఇక క్రిప్టో కరెన్సీ

చైనాలో ఇక క్రిప్టో కరెన్సీ

బీజింగ్‌‌: ప్రపంచంలోనే తొలిసారిగా ఒక దేశం సొంత క్రిప్టోకరెన్సీని తీసుకొస్తున్నది. అదెవరో కాదు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీ, మన పొరుగుదేశమూ అయిన చైనా!! చైనా సెంట్రల్‌‌బ్యాంకు నాయకత్వంలో డిజిటల్‌‌ యువాన్‌‌ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఫేస్‌‌బుక్‌‌ ‘ లిబ్రా’ వంటి కరెన్సీలకు ధీటుగా దీనిని మార్చడం, ప్రపంచవ్యాప్తంగా అంగీకరించేలా చేయడం చైనా టార్గెట్‌‌ అని తెలుస్తోంది. పన్నుల వసూళ్ల పెంపునకూ డిజిటల్‌‌ కరెన్సీని ఉపయోగించుకోనుంది చైనా. ఈ విషయంలో అది సక్సెస్‌‌ అయితే మిగతా దేశాలూ డిజిటల్‌‌ కరెన్సీ బాటపట్టే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్‌‌ యువాన్ తెచ్చేందుకు చైనా ఐదేళ్ల నుంచి పనిచేస్తోంది. ఇది ప్రైవేట్‌‌ బ్లాక్‌‌చైనా టోకెన్‌‌. చెల్లింపులకు పటిష్ట భద్రత ఉంటుంది. బ్యాంకింగ్‌‌ సిస్టమ్‌‌ ద్వారా పీపుల్స్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ చైనా డిజిటల్‌‌ యువాన్‌‌ను సప్లై చేస్తుంది. అంత మొత్తం సాధారణ కరెన్సీని వెనక్కి తీసుకుంటారు. అలీపే, వీచాట్‌‌ పే వంటి క్యూఆర్‌‌ కోడ్‌‌ ఆధారిత వాలెట్లూ డిజిటల్‌‌ కరెన్సీని అంగీకరిస్తాయి.

ఇతర దేశాలకు ఇబ్బందేనా ?

డిజిటల్‌‌ యువాన్‌‌ సంప్రదాయ బ్యాంకింగ్‌‌ సిస్టమ్‌‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.  కరెన్సీ ఎక్సేంజీ రేట్ల విధానమూ మారొచ్చు కూడా. అంటే ఇండియా రూపాయి, సింగపూర్‌‌ డాలర్‌‌ ఇలా  ఏ కరెన్సీని అయినా చైనా సెంట్రల్‌‌ బ్యాంకులో డిజిటల్‌‌ కరెన్సీ రూపంలో డిపాజిట్‌‌ చేయవచ్చు. దీనివల్ల చైనా సెంట్రల్‌‌ బ్యాంకు గుత్తాధిపత్యం పెరగవచ్చు. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకుగా చైనా సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ మారవచ్చని  ఒక ఎనలిస్టు చెప్పారు. ‘‘ చైనా సెంట్రల్‌‌ బ్యాంకు తన సొంత బ్యాంకింగ్‌‌ సిస్టమ్‌‌ను ఎందుకు నిరుత్సాహపరుస్తుంది ? అనే అనుమానం కొందరికి రావొచ్చు. ఇలా చేయడం వల్ల నెగటివ్‌‌ వడ్డీరేట్ల భారం వాటికి ఉండదు. ఆర్థికమాంద్యం వచ్చినా బ్యాంకుల అవసరం లేకుండానే బయటపడవచ్చు. ప్రజలందరి లావాదేవీలను సులువుగా గుర్తించవచ్చు  ’’ అని ఆయన వివరించారు. ఫేస్‌‌బుక్‌‌ ‘లిబ్రా’ పేరుతో క్రిప్టోకరెన్సీని మొదలుపెట్టాక, అది డాలర్‌‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందనే అంచనాలు వచ్చాయి. దీంతో చైనా అప్రమత్తమయింది.  డిజిటల్​ యువాన్​ను అంతర్జాతీయ మార్కెట్లు కూడా అంగీకరిస్తాయని చెబుతోంది. ఇన్వెస్ట్‌‌మెంట్లకూ వాడుకోవచ్చని చెబుతోంది.  డిజిటల్​ యువాన్​ వల్ల వర్ధమాన దేశాలు ఇబ్బందిపడే అవకాశాలు ఉన్నాయని ఎకానమిస్టులు అంటున్నారు.