
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్- కమ్- ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్ చేయబోనని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి స్పష్టం చేశారు. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే వ్యక్తిని తానేనని వెల్లడించారు.
శనివారం ఆయన రాజ్భవన్లో నీట్–2023 టాప్ స్కోరర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులో నీట్ను మినహాయించాలని కోరుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు ఆమోదం లభిస్తుందా అని నీట్ టాప్ స్కోరర్ల పేరెంట్స్ ప్రశ్నించారు. దీనికి గవర్నర్ జవాబిస్తూ..“నేను నీట్ (బిల్లు)కు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వనని మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాను.
ఉమ్మడి జాబితాకు చెందిన అంశం కాబట్టి ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. దేశమంతా నీట్ ఎగ్జామ్ ఉంటుంది” అని వివరించారు. నీట్ లేకుండా స్టూడెంట్లు సాధించిన విజయాలు వారి భవిష్యత్తుకే మంచిది కాదని తెలిపారు.