మొదటి 6 నెలల్లో 49 శాతం పైకి
ముంబై : అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్తో దేశంలో బంగారు నగలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ డిమాండ్ 49 శాతం పెరిగి 140.3 టన్నులకు చేరినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. జనవరి– జూన్ మధ్య కాలంలో ఇండియాలో బంగారం డిమాండ్ 170.70 టన్నులకు చేరిందని పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 119.6 టన్నులు మాత్రమేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు వెల్లడించింది. విలువపరంగా చూస్తే మన దేశంలో గోల్డ్ డిమాండ్ 54 శాతం గ్రోత్ రేటుతో రూ. 79,270 కోట్లయినట్లు పేర్కొంది. కాకపోతే, ఇటీవల కాలంలో రూపాయి బలహీనపడటం, ఇన్ఫ్లేషన్, ప్రభుత్వ పాలసీలలో మార్పు వంటి వాటి ఎఫెక్ట్ రాబోయే ఆరు నెలల్లో గోల్డ్ డిమాండ్పై పడనున్నట్లు అంచనా వేస్తోంది.
2022లో డిమాండ్ 850 టన్నులు
2022 పూర్తి ఏడాదికి మన దేశంలో గోల్డ్ డిమాండ్ 800 నుంచి 850 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ (ఇండియా) పీ ఆర్ సోమసుందరం వెల్లడించారు. 2021లో ఈ డిమాండ్ 797 టన్నులని చెప్పారు. రెండో ఆరు నెలల్లో (అంటే జులై–డిసెంబర్ కాలంలో) బంగారు నగలకు డిమాండ్ కొంత తగ్గుతుందని భావిస్తున్నారు. బంగారంపై డ్యూటీ పెంపు, గోల్డ్ కొనుగోలుపై మరిన్ని ఆంక్షలు, డాలర్తో రూపాయి మారకపు విలువ క్షీణత నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయనేది డబ్ల్యూజీసీ అంచనా. అయితే, రుతుపవనాలు సాధారణంగా ఉండి, ఇన్ఫ్లేషన్ పెరిగి, బంగారం రేట్లు ఒక రేంజ్లోనే కదలాడితే మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని సోమసుందరం పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 న రూ. 43,994 గా ఉన్న 10 గ్రాముల బంగారం రేటు జూన్ 30 నాటికి రూ. 46,054 కి పెరిగిందని చెప్పారు. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో బంగారు నగలకు డిమాండ్ విలువ పరంగా 60 శాతం పెరిగి రూ. 65,140 కోట్లకు చేరిందన్నారు. ఒక్క రెండో క్వార్టర్కే చూస్తే బంగారంలో పెట్టుబడులు 20 శాతం పెరిగాయి. దీంతో డిమాండ్ 30.4 టన్నులకు పెరిగిందని అన్నారు.
మన దేశంలో రీసైకిల్డ్ గోల్డ్ గ్రోత్
2022 రెండో క్వార్టర్లో మన దేశంలో రీసైకిల్డ్ గోల్డ్ 18 శాతం పెరిగి 23.3 టన్నులకు చేరింది. ఇదే క్వార్టర్లో దిగుమతులు 34 శాతం పెరిగి 170 టన్నులకు చేరాయి. అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లో ఈ దిగుమతులు 131.6 టన్నులే. ఓవైపు బంగారం డిమాండ్ పుంజుకుంటున్నా, మరోవైపు దేశంలోని బులియన్ మార్కెట్లో కొన్ని ఫండమెంటల్ మార్పులు చోటు చేసుకుంటున్నాయని సోమసుందరం పేర్కొన్నారు.
బంగారానికి గ్లోబల్ డిమాండ్ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 8 శాతం తగ్గి 948.4 టన్నులకు చేరింది. కిందటేడాది రెండో క్వార్టర్లో ఈ డిమాండ్1,031.8 టన్నులని డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెండ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అవుట్ఫ్లో పెరగడంతో పాటు, సెంట్రల్ బ్యాంకుల నుంచి డిమాండ్ తక్కువ కావడం వల్లే డిమాండ్ కొంత తగ్గినట్లు పేర్కొంది. గ్లోబల్గా ఏప్రిల్–జూన్ 2022 మధ్యలో గోల్డ్ రేట్లు ఔన్సుకి 1,870 డాలర్ల వద్ద నిలిచాయి. కిందటేడాది ఈ రేట్లు 1,816 డాలర్లని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సోమసుందరం చెప్పారు.
ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ (ఐఐబీఎక్స్) లాంఛ్...
అహ్మదాబాద్లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటయిన ఐఐబీఎక్స్లో ట్రేడింగ్ లాంఛ్ కానుండటంతో ఒక కొత్త జర్నీ మొదలవుతుందని సోమసుందరం చెప్పారు. గ్లోబల్ బులియన్ మార్కెట్లలో ఇండియా ప్రభావం పెరిగేందుకు ఈ కొత్త ఎక్స్చేంజ్ వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని బంగారం నిల్వలను ఏదో ఒక రకంగా నగదు రూపంలోకి తేవాలనే ఇండియా ప్రయత్నాలకు కూడా ఐఐబీఎక్స్ మద్దతు దొరుకుతుందని సోమసుందరం చెప్పారు.