- ఇథనాల్కు పెరుగుతున్న డిమాండ్.. కేంద్ర మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్లలో ఇథనాల్ కలపడం పెరుగుదలతో దేశంలోని ఎగ్రికల్చర్ ఎకానమీ రూపురేఖలు మారనున్నాయని, ఇకపై రైతులు అన్నదాతలుగా మాత్రమే కాకుండా ఉర్జ దాతలు కూడా అవుతారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 20% కంటే ఎక్కువ ఇథనాల్ బ్లెండ్స్తో నడిచే బీఎస్6 (స్టేజ్2) ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బేస్డ్ వెహికల్ను మంగళవారం గడ్కరీ లాంఛ్ చేశారు. ఇలాంటి వెహికల్ తేవడం ప్రపంచంలోనే మొదటిసారి. మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్లతో పోలిస్తే జీడీపీలో అగ్రికల్చర్ సెక్టార్ వాటా చాలా తక్కువగా 12 శాతంగా నమోదవుతోందని చెబుతూ, మరోవైపు దేశంలోని 65% ప్రజలు జీవనం కోసం అగ్రికల్చర్పైనే ఆధారపడుతున్నారని గడ్కరీ పేర్కొన్నారు. ఇథనాల్ పరిశ్రమ దేశంలోని రైతులకు వరంగా మారనుందని చెప్పారు. ఇథనాల్ డిమాండ్ రాబోయే కాలంలో భారీగా పెరుగుతుందని, ఫలితంగా దేశపు అగ్రికల్చర్ ఎకానమి తీరుతెన్నులూ మారిపోతాయని పేర్కొన్నారు. దీంతో ఇప్పటిదాకా అన్నదాతలుగా పేరొందిన రైతులు ఇక మీదట ఉర్జ (ఇంధన) దాతలు గాను అవుతారని వెల్లడించారు.
ఇథనాల్తో జీడీపీలో అగ్రికల్చర్ వాటా పెరుగుతుంది
దేశంలో ఇథనాల్ డిమాండ్ పెరుగుదలతో జీడీపీలో వ్యవసాయ రంగ వాటా పెరుగుతుందనే ధీమాను రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ వ్యక్తం చేశారు. ఇథనాల్ ఎకానమి ఒక రోజు రూ. 2 లక్షల కోట్లకు ఎదుగుతుందని, ఆ రోజు జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి చేరుతుందని ఆయన అంచనా వేశారు. ఆల్టర్నేటివ్ ఫ్యూయెల్స్తో జెనరేటర్ సెట్స్, వెహికల్స్, ఎయిర్క్రాఫ్ట్లపై నిర్వహించిన టెస్టులు సక్సెస్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ సప్లయ్ చేయాల్సిందిగా పొరుగు దేశం బంగ్లాదేశ్ రిక్వెస్ట్ చేస్తోందని చెప్పారు. దేశంలో పొల్యూషన్ తగ్గేలా తగిన టెక్నాలజీ డెవలప్ చేసినందుకు టొయోట కిర్లోస్కర్ కంపెనీని మంత్రి అభినందించడంతోపాటు, కృతజ్ఞతలు కూడా తెలిపారు. వ్యవసాయ రంగంలో కొత్త ఉద్యోగాలు రావడానికి ఈ చొరవ సాయపడుతుందని అన్నారు. ఫ్లెక్స్ ఇంజిన్స్తో మరిన్ని మోడల్స్ తేవల్సిందిగా మంత్రి కోరారు. నూరు శాతం ఇథనాల్తోనే నడిచే మోటార్ సైకిళ్లు, ఈ–రిక్షాలు, ఆటో రిక్షాలు, కార్లు రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.
ఇనోవా హైక్రాస్ మోడల్లాంటిదే...
ఇనోవా హైక్రాస్ మోడల్ ఆధారంగా ఈ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికల్ను టొయోటాకిర్లోస్కర్ డిజైన్ చేసింది. దేశంలోని ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా దీనిని డెవలప్ చేశారు. 2014 దాకా దేశంలోని వెహికల్స్లో 1.53 శాతం మాత్రమే ఇథనాల్ కలిపేవారని, మార్చి 2023 నాటికి అది 8 రెట్లు పెరిగి 11.5 శాతానికి చేరిందని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఫలితంగా దిగుమతుల ఖర్చు ఆదా అవడంతోపాటు, కార్బన్ ఎమిషన్లూ తగ్గాయని పేర్కొన్నారు. ఈ–20 బ్లెండింగ్ కోసం పెట్టుకున్న టార్గెట్ను ముందుకు జరిపామని, అందరు స్టేక్హోల్డర్ల చొరవ వల్లే ఇది సాధ్యమవుతోందని వివరించారు. దేశంలో ఈ–20 ఫ్యూయెల్ డిస్పెన్స్ చేసే 2025 నాటికి 3,300 ఏర్పాటవుతాయని మంత్రి పేర్కొన్నారు.