- టీఆర్ఎస్తో చేయాల్సిన పోరు ప్రతిపక్షాల నడుమ
- సొంత పార్టీలోనే చిచ్చు పెట్టిన రేవంత్ వ్యాఖ్యలు
- క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వెంకట్రెడ్డి
- రాజగోపాల్కు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు
- రేవంత్ను సమర్థించిన కాంగ్రెస్ లీడర్లు
హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు పొలిటికల్ హీట్ను పెంచాయి. ఆయన మాటలు సొంత పార్టీలోనే చిచ్చు పెట్టాయి. అదే సమయం లో రేవంత్ మాటలు అభ్యంతరకరంగా ఉండడంతో బీజేపీ నేతలు కూడా రాజగోపాల్కు అండగా నిలిచి రేవంత్కు కౌంటర్లు ఇచ్చారు. దాంతో అధికార టీఆర్ఎస్తో సాగాల్సిన వార్ రెండు ప్రతిపక్షాల మధ్య యుద్ధంగా మారిపోయింది. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ తలపడాల్సింది టీఆర్ఎస్తోనే. కానీ రేవంత్ చేసిన కామెంట్లతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ను, సోనియాను తాను విమర్శించననీ, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం, కేసీఆర్ అరాచక పాలన మీద యుద్ధం సాగించేందుకే పార్టీ వీడుతున్నానని రాజగోపాల్ ప్రకటించినా.. ఆయనపై రేవంత్ వ్యక్తిగత కామెంట్లు చేయడంతో పరిణామాలు మారిపోయాయి. బుధవారం రాజగోపాల్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి రేవంత్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. దాని తర్వాత అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు వరుసగా ప్రెస్మీట్లు పెట్టారు. రాజగోపాల్కు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచి రేవంత్ను ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమ నాయకుడ్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. రాజగోపాల్ అన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ తీరును తప్పుబట్టారు. తమ కుటుంబంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కామెంట్లు కాంగ్రెస్లో కూడా అంతర్గత విభేదాలకు దారి తీసినట్లయ్యాయి.
రాజగోపాల్, రేవంత్.. మాటకు మాట
రాజగోపాల్రెడ్డి మంగళవారం తన రాజీనామా సందర్భంగా మాట్లాడుతూ.. సోనియా గాంధీపై తనకు గౌరవం ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ పీసీసీ చీఫ్ రేవంత్పై మాత్రం పరోక్షంగా కామెంట్ చేశారు. 20 ఏండ్లు కాంగ్రెస్ను తిట్టిన వ్యక్తి చెప్పినట్లు విని తాము పని చేయాలా, అంతలా ఆత్మను చంపుకునే అవసరం తమకు లేదని రేవంత్ పేరు ప్రస్తావించకుండా అన్నారు. అయితే దీనిపై రేవంత్ అదే రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టులకు ఆశ పడి తల్లి లాంటి సోనియాకు ద్రోహం చేశారని మండిపడ్డారు. దీనిపై రాజగోపాల్ బుధవారం ఉదయం తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి.. రేవంత్ బ్లాక్ మెయిలర్ అని, సోనియాను బలి దేవత అన్న వ్యక్తి పైసలిచ్చి పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. పార్టీని చంద్రబాబు కోసం, ఆంధ్రావాళ్ల కోసం తాకట్టుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రేవంత్ తెలంగాణ ఉద్యమంలోనే లేరని, రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన తమను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. రేవంత్ చరిత్ర హీనుడని రాజగోపాల్రెడ్డి విమర్శించారు.
రేవంత్కు మద్దతుగా కాంగ్రెస్ లీడర్లు..
రేవంత్కు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో వరుసగా పోటీపడి ప్రెస్మీట్లు పెట్టారు. సీనియర్ నేత చిన్నా రెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ మొదలుకొని రంగారెడ్డి జిల్లా నేతల వరకు వరుసగా మీడియాతో మాట్లాడారు. అన్ని పదవులు అనుభవించి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీని వీడడం అన్యాయమని, రేవంత్ను విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు. మూడేండ్లుగా కాంగ్రెస్లోనే ఉంటూ బీజేపీకి పని చేశారని వారు ఆరోపించారు. రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన పనిని చూసి సోనియా పీసీసీ చీఫ్ పదవి ఆయనకు ఇచ్చారని పేర్కొన్నారు. మునుగోడులో కాంగ్రెస్ రక్తం అంటే ఏమిటో చూపిస్తామని శపథం చేశారు. కార్యకర్తలు తమ వెంటనే ఉన్నారని అన్నారు.
కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేతలు
రేవంత్కు బీజేపీ నేతలు డీకే అరుణ, రఘునందన్రావు, ఈటల రాజేందర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్లో పుట్టి పెరిగినోడి లెక్క రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదమని, ఆయన భాష మార్చుకో వాలని అరుణ అన్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ చంద్రబాబుగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దొడ్డిదారిన చేరిన చరిత్ర రేవంత్దని ఆమె మండిపడ్డారు. అడ్డదారుల్లో రేవంత్రెడ్డి పదవులు తెచ్చుకున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని రఘునందన్ హెచ్చరించారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో విలీనం అయితే రేవంత్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. నాల్గవ ‘ఆర్’ గా రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేశారు.