
- అనంతరం మద్యం మత్తులో చనిపోయాడని నమ్మించింది
- మెడపై గాయాలు ఉండడంతో బయటపడ్డ బాగోతం
- నిందితురాలు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి హత్య చేసిన మహిళను బాచుపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. నారాయణపేట జిల్లా రామకృష్ణయ్య పల్లికి చెందిన అంజిలప్ప(45), రాధ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, ఉపాధి కోసం మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లికి వలస వచ్చారు. రాధ తరచూ తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండడంతో భర్త పలుమార్లు మందలించాడు. ఇదే విషయమై జూన్22న మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు.
దీంతో తన భర్తను రాధ గొంతునులిమి హత్య చేసింది. అనంతరం అతిగా మద్యం తాగి చనిపోయాడని అందరినీ నమ్మించి స్వగ్రామానికి తీసుకెళ్లింది. అక్కడ మృతుడి గొంతుపై గాయాలు ఉండడంతో అంజిలప్ప సోదరుడు నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసును బాచుపల్లి పోలీసులకు బదిలీ చేయగా, నిందితురాలు రాధను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అసలు విషయం బయటపడడంతో శనివారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.