
- ఆమెతో పాటు మరో ఇద్దరు అరెస్ట్
- 52 గ్రాముల కొకైన్, 45 ఎల్ఎస్డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
హైదరాబాద్/గండిపేట, వెలుగు: గోవా నుంచి సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న మహిళతో పాటు మరో ఇద్దరిని రాజేంద్రనగర్ ఎస్వోటీ, మోకిల పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్లోని డీసీపీ ఆఫీసులో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీకి చెందిన లింగంపల్లి అనురాధ(34) భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. డ్రగ్స్కు బానిసైన ఆమె తరచూ గోవాకు వెళ్లి సప్లయర్ల వద్ద కొకైన్, ఎండీఎంఏ పిల్స్ కొని సిటీకి తీసుకొచ్చేది.
వాటిని సిటీలోని కస్టమర్లకు అమ్మేది. గచ్చిబౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్, కన్జ్యూమర్ ప్రభాకర్ రెడ్డి(38), జూబ్లీహిల్స్లో ఉండే వెంకట శివసాయికుమార్(33)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి డ్రగ్స్ దందాను కొనసాగించారు. అనురాధ ఫ్లైట్లో గోవాకు వెళ్లి నైజీరియన్ జేమ్స్ వద్ద రూ.10 వేలకు గ్రాము చొప్పున డ్రగ్స్ ను కొని ట్రావెల్స్ బస్సు లేదా కారులో సిటీకి వచ్చేది. ఆమె తీసుకొచ్చిన డ్రగ్స్ ను ప్రభాకర్ రెడ్డి. వెంకట శివసాయికుమార్ సిటీలోని కస్టమర్లకు గ్రాము రూ.20 వేలకు అమ్మేవారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఓఆర్ఆర్ పరిధి ఇంద్రారెడ్డి నగర్లో అనురాధ, ప్రభాకర్ రెడ్డి, సాయికుమార్ ముగ్గురు కలిసి కొకైన్తో పాటు ఎండీఎంఏ పిల్స్ను షేర్ చేసుకుంటున్నారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్
ఎస్వోటీ, మోకిల పోలీసులు అక్కడికి చేరుకుని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14 లక్షల విలువైన 51.45 గ్రాముల కొకైన్, 44 ఎండీఎంఏ పిల్స్, 8 గ్రాముల పౌడర్, మూడు ఆయిల్ బాటిళ్లు, 5 సెల్ఫోన్లు, మూడు కార్లు, రూ.97 వేల 500 క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశామని.. సోమవారం వారిని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితుల సెల్ ఫోన్లలో ఉన్న కస్టమర్లు, పెడ్లర్ల నంబర్లను గుర్తించి.. వారి నెట్వర్క్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.