- నేడు శ్రీ లంకతో తొలిపోరు
- మ. 1 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
సిల్హెట్ (బంగ్లాదేశ్): ఇంగ్లండ్లో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి జోరుమీదున్న ఇండియా విమెన్స్ టీమ్.. మరో మెగా టోర్నీకి రెడీ అయ్యింది. విమెన్స్ ఆసియా కప్ (టీ20)లో భాగంగా శనివారం జరిగే తొలి మ్యాచ్లో టీమిండియా.. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. లెజెండరీ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్, మన్కడింగ్ వివాదాలను పక్కనబెట్టి తాజాగా ఈ టోర్నీని మొదలుపెట్టాలని హర్మన్సేన భావిస్తోంది. ఇంటర్నేషనల్ టీ20లో ఇండియాకు పెద్దగా సక్సెస్ లేకపోయినా.. ఆసియాకప్లో మాత్రం ఎప్పుడూ ఫేవరెట్గానే బరిలోకి దిగుతున్నది. ఇప్పటివరకు ఏడుసార్లు ఈ టోర్నీ జరిగితే ఇండియా ఆరుసార్లు చాంపియన్గా నిలిచింది. వన్డే ఫార్మాట్లో నాలుగు, టీ20 ఫార్మాట్లో రెండు టైటిల్స్ను గెలుచుకుంది. 2018లో ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే కొవిడ్ కారణంగా నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మెగా టోర్నీలో ఏడోసారి చాంపియన్గా నిలవాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. 2012 నుంచి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
హర్మన్, మంధానపైనే భారం..
ఇంగ్లండ్లో టీ20 సిరీస్ చేజార్చుకున్న ఇండియా.. ఆ తర్వాత వన్డే సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఇదే జోరును ఇప్పుడు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, హేమలత టచ్లోకి రావాల్సి ఉంది. చేతి గాయంతో ఇంగ్లండ్ టూర్కు దూరమైన జెమీమా రొడ్రిగ్స్.. టీమ్లోకి రావడంతో బ్యాటింగ్ బలం పెరిగింది. కామన్వెల్త్కు దూరంగా ఉన్న వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. జులన్ రిటైర్మెంట్తో పేస్ బౌలింగ్కు రేణుకా సింగ్ నాయకత్వం వహిస్తున్నది. మిగతా పేసర్ల నుంచి ఈమెకు కొద్దిగా సాయం అందినా ఇండియా విజయాన్ని ఈజీగా అంచనా వేయొచ్చు. ఇక రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ.. స్పిన్ మ్యాజిక్ పని చేస్తే లంకకు కష్టాలు తప్పవు.
తొలి టైటిల్పై లంక గురి..
ఈ టోర్నీలో నాలుగుసార్లు రన్నరప్గా నిలిచిన శ్రీలంక తొలి టైటిల్పై కన్నేసింది. ఇది సాధ్యం కావాలంటే కెప్టెన్ చమరి ఆటపట్టు, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డిసిల్వా తమ శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. వెన్ను నొప్పితో టోర్నీకి దూరమైన విష్ని గుణరత్నె లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్లో సరైన అటాకింగ్ లేకపోవడంతో లంకేయులు ఎక్కువగా స్పిన్పై ఆధారపడుతున్నారు. దీంతో ఇనోకా రణవీర, ఒషాడి రణసింఘేపైనే ఎక్కువ భారం పడనుంది. వికెట్ కీపర్ అనుష్క సంజీవని కూడా ఈ మ్యాచ్లో కీలకం కానుంది.
బరిలో ఏడు జట్లు
ఈ ఎడిషన్లో మొత్తం ఏడు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇండియా, పాకిస్తాన్, థాయ్లాండ్, శ్రీలంక, మలేసియా, యూఏఈతో పాటు ఆతిథ్య బంగ్లాదేశ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అన్ని టీమ్స్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో పరస్పరం మ్యాచ్లు ఆడతాయి. టాప్–4లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. ఈ నెల15న ఫైనల్ జరగనుంది.