- 25-45 ఏళ్ల మధ్య ఉన్నవారి వాటానే ఎక్కువ
- లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ మెంట్లకే ఎక్కువ ప్రయారిటీ
బిజినెస్ డెస్క్, వెలుగు: ఒకప్పుడు గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇన్వెస్ట్మెంట్లకు కేరాఫ్ అడ్రస్గా చూసిన మహిళలు, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు వైపు కూడా చూస్తున్నారు. గత రెండేళ్లలో మార్కెట్లలో మహిళల పార్టిసిపేషన్ పెరగడమే దీనికి నిదర్శనం. కరోనా లాక్డౌన్ తర్వాత నుంచి మార్కెట్లలో మహిళల పార్టిసిపేషన్ పెరిగింది. రెండేళ్ల క్రితం మార్కెట్లో మహిళల పార్టిసిపేషన్ 16 శాతం ఉండగా, ప్రస్తుతం ఈ వాటా 24 శాతానికి ఎగిసిందని ఈటీ పేర్కొంది. జెరోధా, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ డైరెక్ట్, అప్స్టాక్స్, 5పైసా వంటి బ్రోకరేజ్ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. 2020, జనవరి 1 నుంచి చూస్తే సెన్సెక్స్, నిఫ్టీలు 40 శాతం మేర పెరిగాయి. ఇలా మార్కెట్లో భారీ లాభాలు వస్తుండడంతో కూడా గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి ట్రెడీషనల్ ఇన్వెస్ట్మెంట్ల నుంచి షేర్ల వైపు మహిళలు చూస్తున్నారు. ‘ట్రెడీషనల్గా చూస్తే గోల్డ్, బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో మహిళలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు’ అని అప్స్టాక్స్ ఫౌండర్ కవితా సుబ్రమణియన్ అన్నారు.
అప్స్టాక్స్లో రెండేళ్లలో కొత్తగా 10 లక్షల మంది..
మహిళా ఇన్వెస్టర్లు లాంగ్టెర్మ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మిలినియం మామ్స్ ఫౌండర్ విష్ణు ధనుకా అన్నారు. క్యాపిటల్ మార్కెట్లో ఓపిక ఎప్పటికైనా లాభానిస్తుందని, మగవారి కన్నా మహిళలే బెటర్ ఇన్వెస్టర్లని చెప్పారు. యాక్సిస్ సెక్యూరిటీస్ డేటా ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్న మహిళా ఇన్వెస్టర్ల వాటా 2018–19 లో 0.4 % ఉండగా, కిందటేడాది 1.5 శాతానికి పెరిగింది. 26–45 మధ్య ఏజ్ ఉన్నవారి వాటా 10.01 % నుంచి 12.3 శాతానికి ఎగిసింది. 45–60 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారి వాటా 4 % నుంచి 5.2 శాతానికి పెరిగింది. 60 ఏళ్లకు పైనున్న మహిళా ఇన్వెస్టర్ల వాటా 2.6 శాతానికి పెరిగింది. 2020 జనవరి నుంచి చూస్తే 10 లక్షల మంది మహిళా ఇన్వెస్టర్లు తమ కస్టమర్ల బేస్కు యాడ్ అయ్యారని అప్స్టాక్స్ పేర్కొంది. ఇందులో 60 % మంది 20–25 ఏళ్ల మధ్య ఉండగా, 85 శాతం మంది టైర్ 2, టైర్ 3 సిటీల నుంచే ఉన్నారు.
షేర్లంటే ఇష్టం..
తమ ప్లాట్ఫామ్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఇన్సూరెన్స్ వంటి వివిధ ప్రొడక్ట్లలో మహిళలు ఇన్వెస్ట్ చేశారని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. వీటన్నింటిలో షేర్లపైనే మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2018–19 లో మహిళా ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్లో 56 శాతం వాటా షేర్లది ఉండేదని, 2021–22 లో ఈ వాటా 67 శాతానికి పెరిగిందని వివరించింది. ఇదే టైమ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయని పేర్కొంది. ‘కరోనా టైమ్లో మహిళా ఇన్వెస్టర్లు పెరుగుతుండడాన్ని చూడొచ్చు’ అని యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈఓ గోప్కుమార్ అన్నారు. ప్రస్తుతం తమ ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉన్న మహిళా ఇన్వెస్టర్ల వాటా 21.49 శాతానికి ఎగిసిందని పేర్కొన్నారు.