నెలసరి నొప్పి, ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్)తో రెగ్యులర్గా ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారు. అది కేవలం శారీరక ఆరోగ్యంతోనే కాకుండా మానసిక ఆరోగ్యంతోనూ ముడిపడి ఉంది. అలాంటి సమస్యలు తీరాలంటే తినే ఫుడ్లో మార్పులు ఉండాలి. కొన్ని రకాల పదార్థాలు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పొత్తి కడుపులో నొప్పి, మొటిమలు, మలబద్ధకం, అలసట, చిరాకు, నిద్రలేమి, ఆందోళన వంటి పీఎమ్ఎస్ లక్షణాలు నెలసరికి ఐదు నుంచి పదకొండు రోజుల ముందే కనిపిస్తాయి. వీటితో పాటు నెలసరి సమయంలో యుటిరస్ కాంట్రాక్షన్ వల్ల కలిగే నొప్పి, హార్మోన్లు సరిగా బ్యాలెన్స్ కాకపోవడం వల్ల వచ్చే సమస్యలు మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే, తీసుకునే తిండి కూడా బాగుండాలని అంటున్నారు న్యూట్రిషనిస్ట్లు. ఉదయంపూట పాలలో నానబెట్టిన కిస్మిస్, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో నెయ్యిని చేర్చుకుంటే మంచిది. అలాగే మధ్యాహ్నం లంచ్లో పెరుగన్నంతో పాటు పాపడాలు కూడా తినాలి. వీటితో పాటు గుప్పెడు పల్లీలు లేదా జీడిపప్పును బెల్లంతో కలిపి తింటే షుగర్ క్రేవింగ్స్, మూడ్ స్వింగ్స్,మలబద్ధకం తగ్గుతాయి. డిన్నర్లో దాల్ కిచిడీ, సాబుదానా కిచిడీ లేదా రాగి రొట్టె తినాలి. ఇవి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.