హైదరాబాద్, వెలుగు: సొంతగడ్డపై వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్షిప్లో సాధించిన గోల్డ్ రాబోయే ఏషియన్ గేమ్స్తో పాటు ఒలింపిక్స్లో తనకు కీలకం అవుతుందని ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చెప్పింది. ఈ గోల్డ్తో తాను నంబర్ ర్యాంక్ సాధించి ఏషియన్ గేమ్స్లో సీడింగ్ అందుకుంటానని తెలిపింది. అక్కడ కూడా గోల్డ్ నెగ్గి పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై అవుతానన్న ఆశాభావం వ్యక్తం చేసింది.
కండ్లల్లో నీళ్లు తిరిగాయి
గత వరల్డ్ చాంపియన్షిప్స్లో గోల్డ్ నెగ్గిన తనపై ఈసారి భారీ అంచనాలు ఉండటంతో కాస్త ఒత్తిడికి గురయ్యానని నిఖత్ చెప్పింది. కానీ, ఢిల్లీలో సొంత అభిమానుల మద్దతు మరో గోల్డ్ మెడల్ నెగ్గేందుకు తనకు శక్తిని ఇచ్చిందని తెలిపింది. ‘నా ఆట చూసేందుకు చాలా మంది స్టేడియానికి వచ్చారు. ఒకవేళ నేను ఓడిపోతే రకరకాల మాటలు వినిపిస్తాయి. దాంతో, నేను వేరే ఏమీ పట్టించుకోలేదు. నా సామర్థ్యంపైనే నమ్మకం ఉంచా. ఒలింపిక్స్ వెయిట్ కేటగిరీలో పోటీ పడుతున్నాను కాబట్టి ఈ టోర్నీని ఓ అనుభవంగా మార్చుకోవాలని, ప్రతీ బౌట్లో నా 100 శాతం ఇవ్వాలని అనుకున్నా. ఫ్యాన్స్ నుంచి నాకు లభించిన సపోర్ట్ మాటల్లో చెప్పలేని అనుభూతి.
మేం ఫారిన్లో ఆడేటప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ ఉండదు. ఈసారి ఢిల్లీలో సొంత అభిమానుల ముందు ఆడటం నాకో కొత్త ఎక్స్పీరియన్స్. టోర్నీ మొత్తం వాళ్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. 2018లో ఇండియాలో వరల్డ్ చాంపియన్షిప్స్ జరిగినప్పుడు నేను టీమ్లో లేను. ఓ అభిమానిగా స్టేడియానికి వెళ్లా. మేరీ కోమ్ మ్యాచ్ జరిగిన ఆ రోజు.. స్టేడియం మొత్తం మేరీ మేరీ అనే పేరు మార్మోగుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఐదేండ్ల తర్వాత నేను ఫైనల్ ఆడిన రోజు అచ్చం అలాంటిదే జరిగింది. అభిమానులంతా నిఖత్.. నిఖత్.. ఇండియా.. ఇండియా అంటుంటే నేను ఎమోషనల్ అయ్యా. నా కండ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని నిఖత్ చెప్పింది.