కోల్కతా: బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్రతీ రాష్ట్రానికి తాము వెళ్తామన్నారు తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ. తమ చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. జెండా ఎగరేయడమో.. లేకపోతే అదే జెండాలో తమను చుట్టి తీసుకురావడమో అన్న లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్నారు. అమిత్ షాకు దమ్ముంటే తమను ఆపాలంటూ సవాల్ విసిరారు అభిషేక్ బెనర్జీ. ఈడీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి, అతడి భార్య రుజిరా బెనర్జీకి ఈ రోజు ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. కోల్ స్మగ్లింగ్ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై విచారించేందుకు సమన్లు పంపింది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు రుజిరా బెనర్జీని సెప్టెంబర్ 1న, అభిషేక్ బెనర్జీని సెప్టెంబర్ 6న న్యూఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది.