మందమర్రి,వెలుగు: ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే లైన్మంచిర్యాల జిల్లా గోదావరి తీరం నుంచి ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి వరకు సుమారు 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ మార్గానికి ఇరువైపులా మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వేలాది మంది సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు నివసిస్తున్నారు. వీరంతా కాజిపేట–బల్లార్షా రూట్లో వరంగల్, హైదరాబాద్, విజయవాడ, కాజిపేటకు రాకపోకలు సాగిస్తున్నారు. సింగరేణి ఎంప్లాయీస్ కొత్తగూడెంలోని కార్పొరేట్ఆఫీస్, మొయిన్ ఏరియా హాస్పిటల్కు వెళ్తుంటారు. సింగరేణి, రామగిరి, అజ్నీ(నాగ్పూర్ ప్యాసింజర్), పుష్పుల్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా రాకపోకలు సాగించారు. ప్రతీ రోజు మంచిర్యాల నుంచి 3,500 మంది, కాగజ్నగర్ లో 2,500, బెల్లంపల్లి, రవీంద్రఖని రైల్వే స్టేషన్ల నుంచి 1,500 నుంచి 2 వేలకు పైగా, మందమర్రి, ఆసిఫాబాద్లో 500 మంది ప్రయాణిస్తుంటారు. టికెట్ల ద్వారా రైల్వేశాఖకు రోజుకు రూ.15 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఆర్కేపీ సీహెచ్పీ, శ్రీరాంపూర్ సీహెచ్పీ, ఆసిఫాబాద్రోడ్డు సైడింగ్ నుంచి బొగ్గు రవాణా ద్వారా రూ.2 కోట్ల ఆదాయం, సిమెంట్, ఇతర సామగ్రి రవాణా ద్వారా మరో కోటి వస్తోంది. అయితే రైల్వేశాఖ కొవిడ్ తర్వాత పలు రైళ్ల స్పీడ్ కెపాసిటీ పెంచింది. ఎక్స్ప్రెస్లుగా మార్చి కొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆఫీసర్లు హాల్టింగ్ కల్పించారు. మంచిర్యాల తర్వాత ఎక్కువ మంది రాకపోకలు సాగించే రవీంద్రఖని(రామకృష్ణాపూర్)లో నాగ్పూర్- కాజిపేట(అజ్నీ) రైలుకు, మందమర్రి, రేచినిరోడ్డు, ఆసిఫాబాద్ స్టేషన్లలో సింగరేణి, రామగిరి, నాగ్పూర్- కాజిపేట(అజ్నీ) రైళ్లకు హాల్టింగ్తొలగించారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు.
ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతలే... కొత్తవి రాలే...
మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి జిల్లా వాసులు వ్యాపార, ఉద్యోగ, విద్య అవసరాల కోసం వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించడంతో రైల్వే శాఖకు రోజుకు రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. మంచిర్యాలలో కేరళ, ఏపీ ఎక్స్ప్రెస్, హంసఫర్, పూరి- కాజిపేట, బికనేర్, సంఘమిత్ర సూపర్ఫాస్ట్ రైళ్లకు, బెల్లంపల్లి, రవీంద్రఖని, మందమర్రి, ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లలో జనత, నవజీవన్, నాగ్పూర్ ఎక్స్ప్రెస్రైళ్లకు, కాజిపేట- నాగ్పూర్ అజ్నీ రైలుకు హాల్టింగ్ కల్పించాలని ఏళ్లుగా స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే మార్గంలో 2011లో ఇంటర్ సిటీ ప్రారంభం కాగా, ఆ తర్వాత మళ్లీ ఒక్క కొత్త రైలు కూడా అందుబాటులోకి రాలేదు. కాగజ్నగర్, బెల్లంపల్లి మీదుగా సింగరేణి సంస్థ ప్రధాన కేంద్రమైన కొత్తగూడెం వరకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడిపాలని, కాగజ్నగర్ -సికింద్రాబాద్, కాగజ్నగర్ వయా పెద్దపల్లి మీదుగా బాసర వరకు, కాజిపేట నుంచి ఆదిలాబాద్ వరకు వయా పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్నగర్, బల్లార్షా, మజ్రికాదన్ మీదుగా కొత్త రైళ్లు వేయాలని డిమాండ్ ఉంది. ఈ మార్గంలో ఉదయం 4 గంటలకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తర్వాత , పది గంటల వరకు హైదరాబాద్ వెళ్లేందుకు కొత్త ట్రైన్ను ఏర్పాటు చేయాలని, సాయంత్రం 4 గంటల తర్వాత సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్వరకు మరో రైలు వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తున్న తిరుపతి– -షిర్డీ రైలును వయా మంచిర్యాల మీదుగా కాగజ్నగర్ వరకు పొడిగించాలని కోరుతున్నారు. బెల్లంపల్లిలో ఫ్లాట్ ఫాంలో లిఫ్ట్ల ఏర్పాటు, బెల్లంపల్లిలోని రైల్వే డిస్పెన్సరీలో మెరుగైన వైద్య సౌలత్లు కల్పించాలని, రైల్వే క్వార్టర్ల నిర్మాణం, కాలనీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తీరని సమస్యల...
మంచిర్యాలలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తోంది. ఫ్లైఓవర్ను కలుపుతూ మరో ఫ్లైఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తీరనుంది. రవీంద్రఖని రైల్వే స్టేషన్లో రెస్ట్హాల్, మందమర్రిలో రెండోవైపు ఫ్లాట్ ఫాం నిర్మాణం, టికెట్ రిజర్వేషన్ సౌలత్, బెల్లంపల్లిలో రెండో ఫ్లాంట్ఫాం పొడిగించాలనే డిమాండ్ నెరవేరడంలేదు. రేచిని స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి, తాండూరు గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం, ఐబీ వద్ద నిర్మించిన అండర్ బ్రిడ్జి అసంపూర్తిగా మారింది. క్యాతన్పల్లి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్పనులు పూర్తికాలేదు. స్టేషన్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టాయిలెట్స్, తాగునీటి వసతి, దివ్యాంగులు, గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు లేవు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్కాజిపేట మార్గంలోని బల్లర్షా వరకు రైల్వే స్టేషన్లను పరిశీలించనున్నారు. సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.