- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్మికుల ఆందోళనలు
బాన్సువాడ/ఎడపల్లి/పిట్లం/వర్ని, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్జిల్లాలోని పలు మండలాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించిన అనంతరం పలువురు లీడర్లు మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ల పర్యవేక్షణ పేరుతో పెత్తనం చేయడం తగదని, సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు రూ.18,000 వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఇండ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఎనిమిది గంటల పనికి బదులుగా పది గంటలు పనిచేయించడాన్ని వ్యతిరేకిస్తూ జీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేసి, పాత 29 కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మండలాలు, పట్టణాల్లోని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బాన్సువాడలో సీఐటీయూ నాయకుడు రవీందర్, సురేష్ గొండ, మహాదేవి, శివగంగా, అనసూయ, పల్లవి, సుజాత, నస్రీన్, బుజ్జిగారి సాయిలు, రాజు, శివరాజు, పిట్లంలో శ్రీనివాస్, రాజేష్, పీరయ్య, సాయికుమార్, బాలయ్య, కృష్ణ, వర్నిలో నన్నేసాబ్, సాయిలు, చరణ్, సాయికుమార్, అనిల్, గంగారాం, రేఖ, లక్ష్మీ, సాయవ్వ, ఎడపల్లిలో సీఐటీయూ నాయకుడు జంగం గంగాధర్తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ లో సీఐటీయూ మండల కన్వీనర్ నాయకవాడి శ్రీనివాస్, అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు పాల్గొన్నారు.
