![కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : అనురాధ](https://static.v6velugu.com/uploads/2024/05/yadadri-bhuvanagiri-district-agriculture-officer-anuradha-has-warned-that-pd-act-will-be-registered-if-adulterated-seeds-are-sold_Jj0KELWUpF.jpg)
- జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ
చౌటుప్పల్, వెలుగు : కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ హెచ్చరించారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ రైతులు డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా అందుకు సంబంధించిన రసీదు తీసుకోవాలని చెప్పారు.
జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆమె వెంట చౌటుప్పల్ మండల వ్యవసాయ అధికారి నాగరాజు తదితరులు ఉన్నారు.