సమస్యలు విని.. పరిష్కారానికి ఆదేశించి : కలెక్టర్ హనుమంతరావు

సమస్యలు విని.. పరిష్కారానికి ఆదేశించి : కలెక్టర్ హనుమంతరావు
  • యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగవాణి  

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్​లోని తన చాంబర్​లో ప్రత్యేకంగా ప్రజావాణి, ఉద్యోగ వాణి నిర్వహించారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు తన చాంబర్​కు వచ్చిన కలెక్టర్​ హనుమంతరావు రాత్రి 8 వరకూ ప్రజలు, ఉద్యోగుల నుంచి వచ్చిన దాదాపు 200 పిటిషన్లను పరిశీలించారు. భూ సమస్యలకు సంబంధించిన పిటిషన్లను పరిశీలించి, సంబంధిత మండల తహసీల్దార్లతో మాట్లాడారు. పిటిషన్​దారుడి పేరు, సమస్య చెబుతూ వాటికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిధిలోని లేని సమస్యలు, ఏ విధంగా పరిష్కారం అవుతాయో సూచించాలని చెప్పారు. 

వృద్ద జంట తమ భూ సమస్య, కుమారుడి నిరాదారణ గురించి వివరించారు. బీబీనగర్​లో కొత్తగా ఏర్పాటు చేయబోయే వైన్ షాపు కారణంగా తాము ఇబ్బంది పడతామని పలువురు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్​ ఎస్పీ విష్ణుమూర్తికి ఫోన్​ చేసిన ఆయన సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కుటుంబ పోషణ కోసం కిరాణాషాపు ఏర్పాటు చేసుకోవడం కోసం బ్యాంక్​కు వెళ్లి లోన్​ అడిగితే ఇవ్వడం లేదని మహిళ జ్యోతి వివరించారు. లీడ్​ బ్యాంక్​ మేనేజర్​కు ఫోన్​ చేసి ఆమెకు లోన్​ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. వాటిని పరిష్కరించే విధంగా ఆదేశాలను జారీ చేశారు.