- అలర్టైన అధికారులు.. సమస్యాత్మక గ్రామాలు, వార్డుల గుర్తింపు
- డిమాండ్ 80 ఎంఎల్డీలు.. సప్లై 54 మాత్రమే!
- లోటు పూడ్చేందుకు 92 ప్రైవేట్ బోర్ల అద్దె, కొత్త పైప్లైన్ల ఏర్పాటు
- 15 ఆర్ధిక సంఘం నుంచి రూ. 2.50 కోట్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి తాకిడి మొదలవడంతో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అప్రమత్తమై యాక్షన్ ప్లాన్రెడీ చేశారు. మిషన్ భగీరథ వాటర్తో పాటు బోరు బావులు, బావుల నుంచి నీరు సరఫరా చేయడానికి ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకుంటున్నారు.
88.76 ఎంఎల్డీ అవసరం..
యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాల్లోని 427 పంచాయతీల్లో 716 హామ్లెట్లు, 2,60,559 కుటుంబాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 మంది ఉండగా, ప్రస్తుతం 9 లక్షల మందికి పైగా జనాభా ఉందని అంచనా వేశారు. ఈ జనాభా అవసరాలకు రోజూ 80 ఎంఎల్డీ నీరు అవసరం. అయితే హెచ్ఎండబ్ల్యూఎస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం నుంచి 53.96 ఎంఎల్డీ నీరు మాత్రమే అందుతోంది.
నీటి ఎద్దడి ఏర్పకుండా చర్యలు..
నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆఫీసర్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. జిల్లాలోని 424 గ్రామ పంచాయతీల్లోని 716 హామ్లెట్లు, మున్సిపాలిటీల్లో రెండు వేలకు పైగా బోరు బావులు, 35 బావులు, 351 చేతి పంపులు ఉన్నాయి. యాక్షన్ ప్లాన్లో భాగంగా వీటిలో కొన్నింటిని ఇప్పటికే రిపేర్ చేయించారు. గతేడాది ఎండాకాలంలో 67 ఆవాసాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఈసారి నీటి ఎద్దడి తీవ్రత ఏర్పడే అవకాశాలున్న 80 అవాసాలు, మున్సిపాలిటీల్లో 25 వార్డులను గుర్తించారు. ఆయా గ్రామాల్లో అవసరమైన స్థాయిలో నీటిని సరఫరా చేసే ప్రైవేట్బోర్లను గుర్తించి 92 బోర్లను రెంట్ తీసుకున్నారు. 6 కిలోమీటర్ల మేర పైపులైన్లు కొత్తగా వేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు, పలు వార్డుల్లో ప్రైవేట్ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
15వ ఫైనాన్స్ నుంచి రూ. 2.50 కోట్లు..
తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఈసారి 15వ ఆర్ధిక సంఘం నుంచి ఫండ్స్ కేటాయించారు. ముందస్తుగానే రూ. 2.50 కోట్లు వరకూ ఖర్చు చేయడానికి కలెక్టర్ అనురాగ్ జయంతి నుంచి ఆమోదం పొందారు. ఈ డబ్బుతో గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోనున్నారు.
ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం..
ఎండాకాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. నీటి ఎద్దడి ఏర్పడే గ్రామాలను గుర్తించాం. సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్బోర్లు కూడా రెంట్కు తీసుకున్నాం. - కరుణాకరన్, డీఈ, ఆర్డబ్ల్యూఎస్, యాదాద్రి
