గోవర్ధనగిరిధారిగా యాదగిరీశుడు

గోవర్ధనగిరిధారిగా యాదగిరీశుడు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు సింహ వాహనంపై మాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు ద్వారం ఎదుట స్వామివారిని అధిష్టింపజేసి అవతార విశిష్టతను ప్రధానార్చకులు నల్లంతీగల్‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు వివరించారు. ఉత్సవాల్లో ఈవో రామకృష్ణారావు, చైర్మన్‌‌ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌శర్మ, ఏఈవోలు శ్రావణ్‌‌కుమార్‌‌, గజవెల్లి రమేశ్‌‌బాబు, రఘు, సూపరింటెండెంట్‌‌ దొమ్మాట సురేందర్‌‌రెడ్డి, రాజన్‌‌బాబు పాల్గొన్నారు.

నేడు స్వామి వారి ఎదుర్కోలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లక్ష్మీ నారసింహుల ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం9 గంటలకు స్వామివారు జగన్మోహిని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి7 గంటలకు స్వామివారిని ఆశ్వవాహనంపై ఊరేగించి ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. ఇందుకోసం ప్రధానాలయం తూర్పు వైపున 
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.