
తిరుమల : రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కోవర్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆరోపించారు. అప్పట్లో కేసీఆర్ కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారని.. ఈ విషయం రేవంత్ కి గుర్తు లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండకుండా.. అక్కడి నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై కూడా విమర్శలు గుప్పించారు. అలాగే, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై స్పందించారు. ఏపీలో టీడీపీ హయాంలో రైతులను దగా చేశారని.. రైతుల కోసం ఏపీ సీఎం జగన్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పిన ఆమె, వివిధ పథకాల ద్వారా 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేశారని తెలిపారు.
జగన్ రైతల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే చంద్రబాబు, లోకేశ్ మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. గతంలో ప్రాజెక్టు వద్ద పోలీసులు కొట్టుకున్న విషయాన్ని లోకేశ్ మర్చిపోయారా? అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.