- ముంబై పోలీస్కు యెస్ బ్యాంక్ కంప్లెయింట్
న్యూఢిల్లీ: తమకు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందంటూ యెస్ బ్యాంకు ముంబై పోలీస్ సైబర్ సెల్ వద్ద కంప్లెయింట్ దాఖలు చేసింది. ప్రమోటర్లు ఉద్దేశపూర్వకంగా తమ వాటాను భారీగా తగ్గించుకోవడంతో యెస్ బ్యాంక్ షేరు గత కొన్ని రోజుల్లో భారీగా పతనమైంది. ఈ నేపథ్యంలోనే యెస్ బ్యాంక్ ముంబై పోలీసుల వద్ద కంప్లెయింట్ ఇచ్చింది. రూమర్ల ఆధారంగా ఫేక్న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఫైనాన్షియల్ హెల్త్పై అపోహలు కలిగించేలా వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలలో ఈ రూమర్లు షికార్లు చేస్తున్నాయని ఆరోపించింది. ఆ ఫేక్న్యూస్ ఎక్కడి నుంచి పుడుతోందో, ఎలా సర్క్యులేట్ అవుతోందో తేల్చాల్సిందిగా అథారిటీస్ను యెస్ బ్యాంక్ కోరింది. డైరెక్ట్గా లేదా ఇన్డైరెక్ట్గా ఎవరైనా వ్యక్తులు యెస్ బ్యాంక్ షేర్లలో షార్ట్సెల్లింగ్కు పాల్పడ్డారేమో దర్యాప్తు చేయాల్సిందిగానూ విజ్ఞప్తి చేసింది. డిపాజిటర్లలో భయం కలిగించేలా సోషల్ మీడియా రూమర్లు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. స్టేక్హోల్డర్ల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అలా భయం కలిగించేలా రూమర్లు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యెస్ బ్యాంక్ ఈ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. పుకార్లు నమ్మవద్దని డిపాజిటర్లు, జనరల్ పబ్లిక్కు యెస్ బ్యాంక్ సూచించింది. ఆర్థికంగా తమకు ఎలాంటి ఢోకా లేదని, పూర్తి పటిష్టంగా ఉన్నామని కూడా పేర్కొంది. షేర్ క్యాపిటల్ను పెంచుకోవడానికి ఆర్బీఐ తమకు అనుమతి ఇచ్చిందని తెలిపింది.