- కాలుతున్న స్థితిలో గుర్తించిన పోలీసులు
- మొయినాబాద్లో తీవ్ర కలకలం రేపిన ఘటన
చేవెళ్ల, వెలుగు: ఫామ్హౌస్లు, రిసార్టులకు సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఓ అమ్మాయిని చంపి నిప్పు అంటించి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం జాగీర్లో సోమవారం మంటల్లో కాలుతున్న యువతి డెడ్బాడీని స్థానికులు గుర్తించడం తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ సమీపంలో రోడ్డు పక్కన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ డెడ్బాడీ మంటల్లో కాలుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. డెడ్బాడీని వీడియో తీశారు. అమ్మాయి వయసు 20 నుంచి 25 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకువచ్చి తగుల బెట్టారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పక్కన సగం కాలిన సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ ని పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చేవెళ్ల పట్టణ కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దర్యాప్తుకు మూడు టీంలు
సంఘటనా స్థలాన్ని రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేందుకు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీస్ బృందాలు డెడ్బాడీ కాలిన ప్రాంతంతోపాటు చుట్టు పక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? ఈ సమీప ప్రాంతంలోనే హత్య చేసి తగులబెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.