- రూ. 100 కోట్ల పెట్టుబడి
ముంబై: ఆన్లైన్ గేమింగ్, స్పోర్ట్స్ కంపెనీ నజారా టెక్నాలజీస్ లిమిటెడ్లో జెరోధా బ్రదర్స్ నిఖిల్, నితిన్ కామత్లు రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. కామత్ బ్రదర్స్కు చెందిన కామత్ అసోసియేట్స్, ఎన్కేస్క్వేర్డ్ల నుంచి నిధులు సమీకరించనున్నట్లు నజారా టెక్నాలజీస్ ప్రకటించింది. పై రెండు కంపెనీలకు కలిపి 7,00,280 ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేసి రూ. 99.99 కోట్లు సేకరించనున్నట్లు వెల్లడించింది.
తమ పట్ల, గేమింగ్ టెక్నాలజీ పట్ల నిఖిల్ కామత్కు ఉన్న నమ్మకానికి తాజా పెట్టుబడులు నిదర్శనంగా నిలుస్తాయని నజారా టెక్నాలజీస్ పేర్కొంది. స్ట్రాటజిక్ ఎక్విజిషన్లతో పాటు, ఇతర కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి తాజా నిధులను వాడనున్నట్లు నజారా టెక్ సీఈఓ నితిష్ మిట్టర్ సెయిన్ వెల్లడించారు. రాబోయే ఏళ్లలో దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ భారీ గ్రోత్ సాధించనుందని ఈ సందర్భంగా నిఖిల్ కామత్ అన్నారు. ఈ అవకాశాన్ని నజారా అందిపుచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నజారాకు గ్రోత్ కోసం తగిన సాయం అందిస్తామని వెల్లడించారు.