- పెరిగిన రెవెన్యూ
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.175 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. రెవెన్యూ పెరగడంతో కంపెనీ ప్రాఫిట్ పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో జొమాటోకి రూ.188 కోట్ల నష్టం వచ్చింది. క్యూ4 లో కంపెనీ రెవెన్యూ రూ.3,562 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.2,056 కోట్ల నుంచి సుమారు 75 శాతం పెరిగింది.
ఖర్చులు రూ.2,431 కోట్ల నుంచి రూ.3,636 కోట్లకు ఎగిశాయి. 2023–24 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే జొమాటోకి రూ.351 కోట్ల నికర లాభం, రూ. 12,114 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.971 కోట్ల నష్టాన్ని, రూ.7,079 కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. గ్రోఫర్స్ (ప్రస్తుతం బ్లింకిట్) ను కొనుగోలు చేయడంతో కిందటేడాది మార్చి క్వార్టర్ ఫలితాలను ఈ ఏడాది క్యూ4 ఫలితాలతో పోల్చకూడదని జొమాటో పేర్కొంది.
క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ బిజినెస్లలో మార్జిన్స్ (లాభాలు) పెరిగాయని వెల్లడించింది. మార్చి నెలలో బ్లింకిట్ ఇబిటా (ట్యాక్స్లు, వడ్డీల ముందు ప్రాఫిట్) బ్రేక్– ఈవెన్ ( నష్టం, లాభం లేకపోవడం) కు చేరుకుందని పేర్కొంది. క్విక్ కామర్స్ బిజినెస్కు సంబంధించి వేగంగా స్టోర్లను ఓపెన్ చేస్తున్నామని, 2025 మార్చి నాటికి వెయ్యి స్టోర్లు ఓపెన్ చేస్తామని కంపెనీ పేర్కొంది.
