
- నాలుగు లక్ష్యాల సాధనకు ఫండ్స్ కేటాయింపు
- బయోమైనింగ్ ప్రక్రియకు ప్రయారిటీ
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.2.53 కోట్లు రిలీజ్
కోల్బెల్ట్, వెలుగు: పట్టణాల్లోని శానిటేషన్మరింత మెరుగుపడేలా కేంద్రం స్వచ్ఛభారత్ నిధులు కేటాయించింది. చెత్త రహిత పట్టణాలు, నగరాలుగా తీర్చిదిద్దడమే టార్గెట్గా చేపట్టిన స్వచ్ఛ భారత్మిషన్(అర్బన్) 2.0లో భాగంగా లక్షలోపు జనాభా ఉన్న పట్టణ, స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. 2021 అక్టోబర్లో ప్రారంభమైన ఈ స్కీమ్ 2026 అక్టోబర్ వరకు కొనసాగనుంది. ముఖ్యంగా నాలుగు లక్ష్యాలు సాధించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని మున్సిపాలిటీలకు దాదాపు రూ.2.53 కోట్ల ఫండ్స్ను తాజాగా రిలీజ్చేశారు. ఏటా రెండు విడతల్లో ఈ నిధులు
రానున్నాయి.
చేపట్టే పనులు ఇవే..
కెపాసిటీ బిల్డింగ్ ప్రొగ్రాం(సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు), వినియోగ నీటి వ్యర్థాలు, ఘన వ్యర్థాలు నిర్వహణ, బయోమైనింగ్, సమాచారం, విజ్ఞానం, కమ్యూనికేషన్(ఐఈసీ) కార్యక్రమాల నిర్వహణకు ఈ ఫండ్స్ను వినియోగించాలి. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) పట్టణాలుగా ప్రకటించిన పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సానిటేషన్, ప్రత్యేక ప్రజా మరుగుదొడ్లు(యాస్పిరేషనల్ టాయిలెట్స్), జీవ వైవిధ్య పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది.
ప్రధానంగా బయోమైనింగ్కు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మున్సిపాలిటీల్లోని డంపింగ్యార్డులను శుభ్రంగా ఉంచనున్నారు. పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుట్టలుగా పేరుకుపోయే చెత్తకుప్పలను చదును చేయడంతో పాటు కంపోస్ట్గా వినియోగించుకునేందుకు వీలుగా బయోమైనింగ్ నిర్వహణ చేపట్టనున్నారు. బయోవేస్టేజ్ ద్వారా వచ్చే వ్యర్థాల నాణ్యతను బట్టి సిమెంట్ఫ్యాక్టరీలకు ఎగుమతి చేయనున్నారు. నిర్మాణాలు, కొనుగోళ్లు, వేతనాల చెల్లింపులకు ఈ నిధులు వినియోగించవద్దని ఆదేశాలున్నాయి.
బయోమైనింగ్ కార్యకలాపాలు మరింత స్పీడప్
స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 ఫండ్స్ ద్వారా మున్సిపాలిటీల్లో మరింతగా మెరుగైన సానిటేషన్ చేపట్టవచ్చు. బయోమైనింగ్ ద్వారా పేరుకుపోయిన చెత్తను చదును చేసి సాధారణ నేలగా మార్చాలనేది ప్రధాన ఉద్దేశ్యం. నిధులు మంజూరు కావడంతో బయోమైనింగ్ పనుల్లో స్పీడ్ పెరుగుతుంది. ఈ స్కీమ్ మరో ఏడాదిపాటు కొనసాగనుంది.
గద్దెరాజు, మున్సిపల్ కమిషనర్, క్యాతనపల్లి