
ఢిల్లీ: ఆన్లైన్ వార్తల పోర్టల్ న్యూస్క్లిక్ కేసులో అమెరికా మిలియనీర్ నెవిల్లే రాయ్ సింగంకు ఈడీ సమన్లు జారీ చేసింది. చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్క్లిక్కు బీజింగ్ నుంచి నిధులు అందుతున్నాయని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. నెవిల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ ప్రమాదకరమైనవి పేర్కొన్నాయి. కేసు నమోదు చేసి, సోదాలు చేపట్టిన ఈడీ.. కొన్ని ఆస్తులను జప్తు చేసింది.
తాజాగా మనీలాండరింగ్ చట్టం కింద భారత విదేశాంగ శాఖ ద్వారా చైనాలోని షాంఘైలో ఉన్న నెవిల్లే రాయ్ సింగంకు నోటీసులు పంపింది. న్యూస్క్లిక్ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలను నెవిల్లే ఇప్పటికే ఖండించారు. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో 2021 సెప్టెంబరులో దిల్లీలోని న్యూస్క్లిక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం న్యూస్క్లిక్ ఎడిటర్-ఇన్- చీఫ్ ప్రబీర్ పురకాయస్థ సహా 25 మంది వాంగూల్మాన్ని నమోదు చేసింది.