
ఇటీవల హింసాకాండకు గురైన నుహ్కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం కూల్చివేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు గానూ బుల్డోజర్లతో వచ్చిన అధికారులు.. ఆగస్టు 3న చర్యలు చేపట్టారు. అంతే కాకుండా దీనికి బుల్డోజర్ తరలింపు, అల్లర్లకు పాల్పడినందుకు వారిపై చర్యగా కూడా అధికారులు ఈ కూల్చివేతలు జరిపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లా యంత్రాంగం, ముఖ్యమంత్రి కూడా.. ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో వలసదారులు పాల్గొన్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూల్చివేతకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతకుముందు అస్సాంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు నుహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్పూర్ రహదారి వెంట వార్డు నంబర్ వన్లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. సుమారు ఒక ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించగా, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. భారీ పోలీసు, పారామిలటరీ మోహరింపు మధ్య బుల్డోజర్ లతో గుడిసెలను కూల్చివేశారు. ఈ సమయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు.
VHP ఊరేగింపుపై దాడిలో చొరబాటుదారులతో సహా బయటి వ్యక్తులు కూడా పాల్గొన్నారని పోలీసులు, పలువురు ఆరోపించారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ తరహాలో హర్యానాలోనూ బుల్డోజర్ చర్యలు తీసుకుంటామని రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు ఆగస్టు 2న అర్థరాత్రి తౌరులోని రెండు మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఈ సమయంలోనే అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం గురుగ్రామ్ మసీదులలో ప్రార్థనలు (జుమ్మా నమాజ్) అనుమతించబడవని, ముస్లిం మత పెద్దలు, ప్రజలు తమ ఇళ్ల నుంచే ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై రాష్ట్రంలో ఇప్పటివరకు 176 మందిని అరెస్టు చేయగా, 90 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి.