న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి పేటీఎం లాభాల్లోకి వస్తుందని కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. జూన్ క్వార్టర్లో కంపెనీ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కమర్షియల్ బిజినెస్ సెగ్మెంట్లో గ్రోత్ రికార్డయ్యిందని ఎర్నింగ్స్ కాల్లో ఆయన వెల్లడించారు. పేటీఎం పేరుతో బిజినెస్ నడుపుతున్న వన్97 కమ్యూనికేషన్స్కు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.358.4 కోట్ల నష్టం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.645.4 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది.
కార్యకలాపాల నుంచి వచ్చిన రెవెన్యూ 39.4 శాతం పెరిగి రూ.2,341.6 కోట్లకు చేరుకుంది. కిందటేడాది జూన్ క్వార్టర్లో ఈ నెంబర్ రూ.1,679.6 కోట్లుగా ఉంది. మర్చంట్ పేమెంట్స్ వాల్యూమ్ (జీఎంవీ) 37 శాతం పెరిగి రూ.4.05 లక్షల కోట్లకు పెరిగిందని పేటీఎం ఓ స్టేట్మెంట్లో వివరించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను తీసుకోకుండా పెట్టిన రిస్ట్రిక్షన్లపై ఫుల్ రిపోర్ట్ను ఆర్బీఐకి సబ్మిట్ చేశామని, త్వరలో అప్రూవల్స్ వస్తాయని అన్నారు.