చండ్రుగొండ, వెలుగు : మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి పోటీలను శుక్రవారం తహసీల్దార్ సంధ్యారాణి ప్రారంభించారు. పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం,స్నేహభావం పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో చండ్రుగొండ, మద్దుకూరు, వెంకట్యాతండా సర్పంచ్లు ఇస్లావత్రుక్మిణి, కృష్ణవేణి, పద్మ, ఎంపీడీవో అశోక్, ఎస్సై శివరామకృష్ణ, టీచర్లు పాల్గొన్నారు.
కారేపల్లిలో..
కారేపల్లి : మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ 2026 క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్ పోటీలను మండల అధికారులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పోటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యతో పాటు క్రీడలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. క్లస్టర్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన తర్వాత మండల జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజ తదితరులు పాల్గొన్నారు.
