ట్రావెలింగ్ ఓ కారణం కావొచ్చు: గంగూలీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన ఐపీఎల్ బయో బబుల్ ఎలా బ్రేక్ అయ్యిందో చెప్పడం కష్టమని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒకవేళ సిటీల మధ్య ప్రయాణం వల్లే కరోనా వైరస్ క్రికెటర్లకు సోకి ఉండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ‘బబుల్ ఎలా బ్లాస్ట్ అయ్యిందో అర్థం కావడం లేదు. దానికి దారి తీసిన పరిస్థితులపై పోస్ట్మార్టమ్ చేస్తున్నాం. కారణాలను వెతికే పనిలో బీసీసీఐ ఉంది. బహుశా ట్రావెలింగ్ కూడా ఓ కారణం కావొచ్చు. ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం బబుల్ బ్రీచ్ కాలేదనే తెలుస్తోంది. అయినా ప్రమాదం ఎలా జరిగిందో చెప్పడం కష్టం. కరోనా సెకండ్ వేవ్లో ప్రస్తుతం దేశంలో ఎంత మందికి ఇన్ఫెక్షన్ సోకిందో చెప్పడం ఎంత కష్టమే ఇది కూడా అంతే. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? అలాగే పరిస్థితులు కూడా మా చేయి దాటిపోయాయి. ముంబై మ్యాచ్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్చేసే టైమ్కు కేసుల సంఖ్య భారీగా ఉంది. అయినా మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ, ఢిల్లీ, అహ్మదాబాద్కు మారిన తర్వాతే తేడా వచ్చింది’ అని దాదా పేర్కొన్నాడు.
సెప్టెంబర్ విండోపై వర్క్ చేస్తాం
ఐపీఎల్ 14ను పూర్తి చేయడానికి సెప్టెంబర్లో విండో లభించే చాన్స్ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటామని గంగూలీ చెప్పాడు. దీనిపై మిగతా బోర్డులతోనూ సంప్రదింపులు చేయాల్సి ఉందన్నాడు. చాలా అంశాలు ముడిపడి ఉన్న లీగ్పై నెమ్మదిగా వర్క్ మొదలుపెడతామన్నాడు. ఒకవేళ తాము ఐపీఎల్ను కంప్లీట్ చేయలేకపోతే రూ. 2500 కోట్ల వరకు నష్టం వస్తుందన్నాడు. ఇక, యూఏఈలో బయో బబుల్ను నిర్వహించిన యూకే కంపెనీ ‘రెస్ట్రాటా’కు ఇండియాలో పని చేసిన ఎక్స్పీరియెన్స్ లేదన్నాడు. అందుకే వేరే కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామన్నాడు. ఇక టీ20 వరల్డ్కప్ను యూఏఈకి షిష్ట్ చేసే అంశంపై ఇప్పడే స్పందించాల్సిన అవసరం లేదన్నాడు. ‘మెగా టోర్నీకి ఇంకా చాలా టైమ్ ఉంది. అప్పటిలోగా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. దానిని బట్టే నిర్ణయాలు ఉంటాయి. షెడ్యూల్ ప్రకారమే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ ఉంటుంది. మన ప్లేయర్లు ఇంగ్లండ్లో వారం రోజులు క్వారంటైన్లో ఉంటారు’ అని దాదా వ్యాఖ్యానించాడు. క్రికెటర్ల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసే ఆలోచన బీసీసీఐకి లేదన్నాడు.