- 2024 లోపు చేరుకునేందుకు ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయండి
- రాష్ట్రాలు, యూటీలకు సూచించిన పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్
- రెన్యూవబుల్ ఎనర్జీని పెంచడంపై ఫోకస్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో డీజిల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు రాష్ట్ర స్థాయిలో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాల( యూటీల) ను కేంద్ర పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆర్కే సింగ్ కోరారు. వ్యవసాయ రంగంలో డీజిల్ వాడకాన్ని 2024 నాటికి జీరో లెవెల్కు తీసుకురావాలన్నారు. రాష్ట్రాలు లేదా యూటీలకు చెందిన చీఫ్ సెక్రెటరీలు తమ రాష్ట్రాల ( లేదా యూటీల) స్టీరింగ్ కమిటీలకు చైర్మన్గా పనిచేస్తారు. అతని ( లేదా ఆమె) నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ‘ ఇంధన వాడకంలో మార్పు కోసం ఓ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులను, యూటీల లెఫ్టినెంట్ గవర్నర్లను కేంద్ర పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ అడిగారు’ అని పవర్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. పవర్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, పబ్లిక్ వర్క్స్ వంటి వివిధ మినిస్ట్రీలకు చెందిన డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రెటరీలు ఈ స్టీరింగ్ కమిటీలలో మెంబర్లుగా ఉంటారని వివరించింది. ఇంధన మార్పులో ఈ కమిటీలు ఇచ్చే రికమండేషన్స్ను రాష్ట్రాలు, యూటీలు పాటించాలని తెలిపింది.
సస్టయినబుల్ డెవలప్మెంట్కు 3 మార్గాలు..
కరెంట్ను పొదుపు చేస్తూనే సస్టయినబుల్ డెవలప్మెంట్ను సాధించడంలో రాష్ట్రాలు, యూటీలు చాలా కీలకమని ఆర్కే సింగ్ పేర్కొన్నారు. ఇంధన మార్పు అంటే వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ను తగ్గించడం, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖాండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేశాయని అన్నారు. లక్ష్యాలను చేరుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలు అనేక మార్గాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పారు. ‘ఇందులో మొదటిది కరెంట్ ఉత్పత్తిలో రెన్యూవబుల్ ఎనర్జీ వాటాను పెంచడం. రెండోది కరెంట్ను పొదుపుగా వాడుకోవడం. మూడోది బయోమాస్, గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని పెంచడం’ అని ఆర్కే సింగ్ వివరించారు. అందరం కలిసి పనిచేస్తే పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేయగలుగుతామని, డెవలప్మెంట్ను వేగవంతం చేయగలుగుతామని అన్నారు. కాగా, సోలార్ ఎనర్జీ వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం వివిధ స్కీమ్ల కింద ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.