లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో సినీ హీరోలు.. ఇళ్లపై ఈడీ దాడులు.. బయటపడ్డ బడా స్కాం....

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో సినీ హీరోలు.. ఇళ్లపై ఈడీ దాడులు.. బయటపడ్డ బడా స్కాం....

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 17 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో మలయాళ హీరోలు పృథ్వీరాజ్,  దుల్కర్ సల్మాన్ ఇళ్లు కూడా ఉన్నాయి. అత్యాధునిక ఖరీదైన లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేయడం (స్మగ్లింగ్), అలాగే విదేశీ డబ్బు లావాదేవీల (హవాలా) ఉల్లంఘనలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి.

దాడులు ఎవరిపై జరిగాయంటే : ఈ సోదాలు మలయాళ హీరోలు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, అమిత్ చక్కలకల్పై ఇళ్ల పై, ఇంకా ఎర్నాకుళం, త్రిస్సూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం (కేరళ), కోయంబత్తూరు (తమిళనాడు)లలోని వాహనాల యజమానులు, వర్క్‌షాప్‌లు సహా వ్యాపారులపై జరిగాయి.

అక్రమ రవాణా : భారతదేశం-భూటాన్, భారతదేశం-నేపాల్ సరిహద్దుల ద్వారా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసెరటి వంటి ఖరీదైన కార్లను అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చి, రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా గురించి సమాచారం రావడంతో ED ఈ చర్యలు తీసుకుంది.

ALSO READ : ఈ పాటతో మళ్లీ ఆ వైబ్‌‌ తెస్తానంటున్న నోరా ఫతేరా

కోయంబత్తూరుకు చెందిన ఓ నెట్‌వర్క్ ఈ కార్లను రిజిస్ట్రేషన్ చేయడానికి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారత సైన్యం, US రాయబార కార్యాలయం నుండి వచ్చినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించినట్లు మొదటి విచారణలో తెలిసింది. ఈ వాహనాలను సినీ ప్రముఖులతో సహా డబ్బున్న వ్యక్తులకు తక్కువ ధరలకు అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.

హవాలా మార్గాల ద్వారా అనధికారికంగా విదేశీ డబ్బు లావాదేవీలు జరపడం, సరిహద్దు చెల్లింపుల విషయంలో FEMA (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనలు ఉల్లంఘించారని  గుర్తించిన తర్వాత ED రంగంలోకి దిగింది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఈ స్మగ్లింగ్‌లో ఎవరు లబ్ధిపొందారు, విదేశీ డబ్బు కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మరింత లోతు విచారణ జరుగుతోంది.

గతంలో కూడా  సోదాలు: గత నేనెలలో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) & కస్టమ్స్ అధికారులు కలిసి 'నుమ్ఖోర్' అనే కోడ్‌తో దేశవ్యాప్తంగా కార్ల పన్ను ఎగవేతపై చర్యలు ప్రారంభించారు. ఇందులో కేరళపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సెప్టెంబర్ 23న, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాలతో సహా కేరళలోని 30 చోట్ల సోదాలు జరిగాయి.