
- నల్గొండ జిల్లాలో11.47 లక్షల ఎకరాలు
- సూర్యాపేటలో 6.17లక్షలు
- యాదాద్రిలో 4.40 లక్షలు
నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. వర్షాలు కురిసిన వెంటనే రోహిణి కార్తెలో కొన్ని చోట్ల ఆరుతడి పంటల విత్తనాలు విత్తుతున్నారు. మృగశిర కార్తె సైతం జూన్ 8న ప్రవేశించనుండడంతో సాగు పనుల్లో రైతులు బిజీ కానున్నారు. అయితే ముందు మురిపించిన వానలు.. ఇప్పుడు మళ్లీ ముఖం చాటేశాయి. దీంతో రైతుల్లో కాస్తా ఆందోళన నెలకొంది.
నల్గొండ జిల్లాలో 11.47 లక్షల ఎకరాలు..
నల్గొండ జిల్లాలో 11.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఇందులో ఎప్పటిలానే వరి ఎక్కువగా పండించనున్నారు. 5,25,350 ఎకరాల్లో వరి, 5,47,735 ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో కంది, 1200 ఎకరాల్లో పెసర, 1500 ఎకరాల్లో వేరుశనగ, 73,010 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు పండించనున్నారు. 1.44 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. సెప్టెంబర్ నాటికి 61 వేల టన్నుల డీఏపీ, 33 వేల టన్నుల పొటాషియం, 11.44 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 12 వేల టన్నుల సూపర్ అవసరం కానుంది. ప్రస్తుతం 30 వేల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 9 వేల టన్నులు డీలర్ల వద్ద, 17 వేలు మార్క్ ఫైడ్ వద్ద, 4 వేల టన్నులు గోదాముల్లో నిల్వ ఉన్నాయి. సాగుకు అవసరమైన విత్తనాలు రెడీగా ఉన్నాయని, ఇప్పటికే కొనుగోళ్లు స్పీడ్గా సాగుతున్నాయని ఆఫీసర్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో 6.17 లక్షల ఎకరాలు..
సూర్యాపేట జిల్లాలో వానాకాలం సీజన్ లో 6.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 4,85 లక్షల్లో వరి, 91 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. 15,150 ఎకరాల్లో మిర్చి, 4 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్, 16,200 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. 60,731 మెట్రిక్ టన్నుల యూరియా, 14,580 మెట్రిక్ టన్నుల డీఏపీ, 9,560 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 45,247 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 5,275 ఎస్ఎఫ్సీ అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రస్తుతం 15,680 మెట్రిక్ టన్నుల యూరియా, 855 మెట్రిక్ టన్నుల డీఏపీ, 484 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 8377 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 532 మెట్రిక్ టన్నుల ఎస్ఎఫ్సీ అందుబాటులో ఉన్నాయి.
యాదాద్రి జిల్లాలో 4.40 లక్షల ఎకరాలు..
యాదాద్రి జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని ఆపీసర్లు అంచనా వేశారు. సన్నాలకు క్వింటాల్కు రూ.500 ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో ఈ సీజన్లో ఎక్కువగా పండించే అవకాశాలున్నాయి. వరి తర్వాత 1.15 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంట అయిన పత్తిని రైతులు సాగు చేయనున్నారు. కందులు 6 వేల ఎకరాల్లో సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. 36,200 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు.
ఈ సీజన్కు మొత్తంగా 75,039.91 టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఇందులో జూన్ నెలకు 1,7786 టన్నుల ఎరువులు అవసరం కాగా, 1,5875 టన్నులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వరికి 72,500 క్వింటాళ్ల విత్తనాలు, పత్తికి 2.30 లక్షల ప్యాకెట్లు, కందులు 240 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా వ్యవసాయశాఖ చర్యలు ముమ్మరం చేసింది. వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయం చేసుకుంటూ టాస్క్ ఫోర్స్ టీం విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాయి. ఇతర మార్గాల్లోనూ జిల్లాకు నకిలీ విత్తనాలు రాకుండా అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
ముఖం చాటేసిన వానలు..
ముందుగా మురిపించిన వానలు ఇప్పుడు ముఖం చాటేశాయి. వానలు పడగానే రోహిణి కార్తెలో రైతులు ఆరుతడి పంటల విత్తనాలు విత్తారు. గడిచిన కొన్ని రోజులుగా వాన పడడం లేదు. పైగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో విత్తిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు పడకుండా ఎండలు పెరిగిపోతే విత్తనాలు భూమిలోనే మాడిపోయే అవకాశముంది. అందుకే ముందే విత్తనాలు వేయవద్దని, మంచిగా వానలు పడిన తర్వతే వేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు సూచిస్తున్నారు.