
- స్పీడ్గా ఓపీఎంఎస్ ఎంట్రీ
- కొన్ని సెంటర్లలో గన్నీ బ్యాగుల కోసం రైతుల తిప్పలు
- సకాలంలో లారీలు రాక ఇబ్బందులు
మహబూబ్నగర్, వెలుగు: కొనుగోలు సెంటర్లలో సేకరించిన వడ్లకు రాష్ట్ర సర్కారు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మిల్లర్లు ట్రక్ షీట్లు ఇచ్చిన 24 గంటల్లోనే రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండడంతో పేమెంట్లు స్పీడ్గా జరిగిపోతున్నాయి. ఇక సన్నాలకు సంబంధించి క్వింటాల్కు రూ.500 బోనస్ డబ్బులు వడ్లు అమ్మిన వారం తరువాత ఖాతాల్లో జమ అవుతున్నాయి.
రూ.140 కోట్ల చెల్లింపులు..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ యాసంగిలో పెద్ద మొత్తంలో రైతులు వరి వేయగా.. అదే స్థాయిలో దిగుబడులు వచ్చాయి. రెండు జిల్లాల్లో దాదాపు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 60 శాతం మేర వడ్లు సెంటర్లకు చేరాయి. సివిల్ సప్లయ్ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం.. నారాయణపేట జిల్లాలో 107 సెంటర్లలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 97 సెంటర్లను ఓపెన్ చేసి, 90 వేల మెట్రిక్ టన్నుల వడ్లను 11,924 మంది రైతుల నుంచి సేకరించారు.
వీటిలో సాధారణ రకం 2.18 లక్షల క్వింటాళ్లు, మేలు రకం వడ్లు 6.78 క్వింటాళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఓపీఎంఎస్ పూర్తి చేశారు. రైతులకు రూ.181 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. వీటిలో రూ.83.85 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.98.09 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులను ఒకటి, రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకోగా.. 188 సెంటర్లను ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు 68 మెట్రిక్ టన్నుల వడ్లకు ఓపీఎంఎస్ పూర్తి చేసి రూ.58 కోట్ల వడ్ల పైసలను రైతుల అకౌంట్లలో జమ చేశారు.
ఈ -కుబేర్లో పెండింగ్..
సన్నాల సాగు చేసిన రైతుల అకౌంట్లలోకి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్కు రూ.500 బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఇప్పటికే వడ్లు మిల్లులకు చేరగా, మిల్లర్లకు ట్రక్ షీట్లను కూడా జారీ చేశారు. అలాగే ఓపీఎంఎస్ పూర్తి చేసి.. రైతుల పాస్ పుస్తకాలు, బ్యాంకు పాసు పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లను కూడా కన్ఫర్మేషన్ చేశారు. ఆన్లైన్లో అప్లోడ్ కూడా పూర్తయింది. మహబూబ్నగర్ జిల్లాలో బోనన్కు సంబంధించిన డబ్బులు రూ.6 కోట్ల వరకు ఉండగా, డబ్బులు ఈ -కుబేర్లో పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. వారం రోజుల్లో బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతామని చెబుతున్నారు. నారాయణపేట జిల్లాలో బోనస్ డబ్బులు రూ.2.10 కోట్ల వరకు ఉన్నాయి.
గన్నీ బ్యాగుల కోసం ఆందోళనలు..
గన్నీ బ్యాగుల కోసం ప్రతి రోజూ ఏదో ఒక చోట రైతులు ఆందోళనకు దిగుతూనే ఉన్నారు. ప్రధానంగా ఆలస్యంగా పంటలు వేసిన ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జనవరి చివరి వారంలో వరి సాగు చేసిన మాగనూరు, కృష్ణ, మరికల్ తదితర ఏరియాల్లో 15 రోజుల కింద కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాల్లోని సెంటర్లకు వడ్లు వస్తున్నాయి. అదనంగా వస్తున్న వడ్లకు సరిపడా గన్నీ బ్యాగులు లేక సమస్య వస్తోంది. ఈ విషయాన్ని సెంటర్ల నిర్వాహకులు ఉన్నతాధికారులకు తెలియజేయగా, అదనంగా గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు రోజుల్లో పైసలు పడ్డయ్..
నాకున్న 12 ఎకరాల్లో వరి వేసిన. గ్రౌండ్ వాటర్ తగ్గి, ఎండలు బాగా కాసినా.. 850 బస్తాల దిగుబడి వచ్చింది. కొనుగోలు సెంటర్లో అమ్మిన రెండు రోజులకే పంటకు సంబంధించిన డబ్బులు రూ.7.88 లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. బోనస్ పైసలు ఇంకా జమ కాలేదు. - హాజీబాబా, రైతు, అప్పంపల్లి
ఎంట్రీలు స్పీడ్గా చేస్తున్నాం..
వడ్ల కొనుగోళ్లు స్పీడ్గా జరుగుతున్నాయి. గతం కంటే ఈ సారి ఎక్కువ దిగుబడి వచ్చింది. సెంటర్లకు వస్తున్న వడ్లను వెంటనే కాంటా చేసి అలాట్ చేసిన మిల్లులకు పంపుతున్నాం. అక్కడ వడ్లను దింపుకున్నాక, ట్రక్ షీట్ ఆధారంగా రైతుల వివరాలను ట్యాబ్ల ద్వారా ఆన్లైన్లో ఎంట్రీ చేసే ప్రక్రియను స్పీడ్గా చేస్తున్నాం. రైతులు అన్ని పత్రాలు అందజేస్తే ఎంట్రీ చేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి.
రవి నాయక్, సివిల్ సప్లయ్ డీఎం, మహబూబ్నగర్