- ములుగు జిల్లా గట్టమ్మ గుడి వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీ
- కారు డ్రైవర్ సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణం
ములుగు, వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా గట్టమ్మ తల్లి గుడి సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు చనిపోయారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన కమ్మంపాటి రమేశ్(48),- కమ్మంపాటి శ్రీనివాస్(45)లఅన్న కొడుకు వేణుకు పెండ్లి సంబంధం చూసేందుకు ఫ్యామిలీతోపాటు బుద్దె కల్యాణ్(26) కారులో వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి బయలుదేరారు. ములుగు గట్టమ్మ గుడి మూలమలుపు వద్ద రాంగ్రూట్లో స్పీడ్గా వస్తున్న హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో పక్కనున్న ముళ్లపోదల్లోకి కారు దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జవ్వడంతో కారులో ఉన్న శ్రీనివాస్, అతని భార్య సుజాత, రమేశ్, డ్రైవర్ కల్యాణ్ అక్కడికక్కడే మృతి చెందారు. రమేశ్ భార్య జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి కారులో ఇరుక్కున్న డెడ్బాడీలను బయటకు తీసి పోస్ట్మార్టం కోసం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. జ్యోతికి వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, రమేశ్, శ్రీనివాస్ల పెద్దన్న వెంకటేశ్వర్లు, ఆయన భార్య గతంలోనే మృతిచెందారు. దీంతో వారి కొడుకు వేణును చిన్నప్పటి నుంచి వీరే చదివిస్తున్నారు. ప్రస్తుతం వేణు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడు రమేశ్కు ఇద్దరు కూతుళ్లు ఉండగా వారికి పెండ్లి చేశారు. శ్రీనివాస్ దంపతులకు కూడాఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఊర్లో విషాదం..
ఒకే గ్రామానికి చెందిన రమేశ్, శ్రీనివాస్, సుజాతలు మృతిచెందడంతో ధర్మారంలో విషాదం నెలకొంది. కొడుకులు చనిపోవడంతో తల్లి నర్సింహులమ్మ బాధ అందరిని కంటతడి పెట్టిస్తోంది. బుద్దె కల్యాణ్ 2 నెలల క్రితం కారు కొనుక్కొని కిరాయిలకు నడిపిస్తున్నాడు. కొడుకు చనిపోవడంతో అతని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే సీతక్క మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.