షార్ట్స్ తో ఎగ్జామ్ కు వచ్చిన అమ్మాయి..

షార్ట్స్ తో ఎగ్జామ్ కు వచ్చిన అమ్మాయి..

ఎంట్రెస్ట్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్ కోడ్ తప్పని సరి అని అధికారులు చెబుతున్నా...కొందరు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు..తమ ఇష్టం వచ్చినట్లు డ్రెస్ లు వేసుకుని ఎగ్జామ్ సెంటర్ కు వస్తున్నారు. అస్సాంలో ఇలాంటి ఘటనే జరిగింది.  షార్ట్స్ వేసుకుని ప‌రీక్ష రాసేందుకు వెళ్లిన ఓ అమ్మాయిని కాలేజీ సిబ్బంది అనుమ‌తించ‌లేదు. దీంతో అ విద్యార్థిని ఓ క‌ర్టెయిన్ చుట్టుకుని వెళ్లి ప‌రీక్ష‌ రాసింది. 19 ఏళ్ల  జూబ్లీ తాములి అస్సాం  అగ్రికల్చ‌ర్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన‌ ఓ ప్ర‌వేశ‌ప‌రీక్ష రాసేందుకు వెళ్లింది.

సోనిట్‌పూర్ జిల్లా తేజ్‌పూర్‌లో ఉన్న గిరిజానంద చౌద‌రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాల‌జీలో గేటు దగ్గర  ఆమెను సిబ్బంది అడ్డుకోలేదు. అయితే.. ప‌రీక్ష హాల్‌లోకి వెళ్లే స‌మ‌యంలో అక్క‌డి సిబ్బంది అడ్డుకుని, షార్ట్ ధరించి లోప‌లికి రాకూడదని ఆమెకు చెప్పారు. అయితే.. ఆ విష‌యం అడ్మిట్ కార్డ్‌లో లేదుక‌దా? అని ఆమె ప్ర‌శ్నించింది. అయిన‌ప్ప‌టికీ ఆమెను సిబ్బంది లోప‌లికి వెళ్లనివ్వ‌లేదు. ఆ స‌మ‌యంలో ఆమె తండ్రి ఎగ్జామ్ సెంటర్  గేటు బ‌య‌టే ఉన్నారు. దీంతో జూబ్లీ తాములికి ప్యాంట్ ఏదైనా తీసుకురావాల‌ని ఆమె తండ్రికి అధికారులు చెప్పారు.

ఆయ‌న వెంట‌నే అక్క‌డి నుంచి మార్కెట్‌కు ప‌రిగెత్తారు. అయితే.. అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఇద్ద‌రు యువ‌తులు జూబ్లీకి ఓ ఐడియా ఇచ్చారు. ఓ క‌ర్టెయిన్ చుట్టుకొని వ‌చ్చేయాల‌ని అన్నారు. దీంతో అక్కడున్న ఓ క‌ర్టెయిన్ చుట్టుకుని ఆమె ప‌రీక్ష‌ హాల్‌లోకి వెళ్లి ప‌రీక్ష రాసింది.