
వనపర్తి/మదనాపురం, వెలుగ : మూడు, నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో వనపర్తి జిల్లా మదనాపూరు మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్ట్లోకి భారీ వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 22 అడుగులకు చేరుకోవడంతో ఆటోమేటెడ్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. దీంతో నీరు దిగువకు విడుదల అవుతోంది.
ప్రాజెక్ట్ వద్ద 17 వుడ్ సైఫన్లు, నాలుగు ప్రైమ్ సైఫన్లు ఉండగా... రెండు వుడ్, ఒక ప్రైమ్ సైఫన్ నుంచి నీరు దిగువకు వెళ్తోంది. మరో వైపు రామన్పాడు ప్రాజెక్ట్లోకి భారీ మొత్తంలో వరద వస్తుండడంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఊక చెట్టు వాగు నుంచి వెళ్తున్న వరద నీరు మదనాపూరు రైల్వే గేట్ సమీపంలోని బ్రిడ్జి పైనుంచి పారుతోంది. దీంతో వనపర్తి, మదనాపురం, ఆత్మకూరు వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.