డాలర్ మారకంలో 5 నుంచి 83కి డౌన్‌

డాలర్ మారకంలో 5 నుంచి 83కి డౌన్‌

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం సెషన్‌‌లో 83.26  వరకు పడిపోయింది. ఆల్‌‌ టైమ్‌‌ కనిష్టాన్ని నమోదు చేసింది. స్వాతంత్ర్యం వచ్చి మంగళవారంతో 76 ఏళ్లు పూర్తవుతుంది. ఇదే టైమ్‌‌లో డాలర్ మారకంలో మన కరెన్సీ విలువ  16 రెట్లకు పైగా పడిపోవడాన్ని చూడొచ్చు. 1947 లో ఐదు రూపాయిలకు ఒక డాలర్ వచ్చేది.  డీవాల్యూయేషన్ (వాల్యూ తగ్గించుకోవడం), ఎగుమతులు, దిగుమతుల మధ్య  గ్యాప్‌‌ పెరగడం, బడ్జెట్ డెఫిసిట్‌‌, క్రూడాయిల్ ధరలు పెరగడం, ఆర్థిక సంక్షోభం...ఇలా అనేక కారణాలతో రూపాయి విలువ పడుతూ వస్తోంది. గత 76 ఏళ్లలో దేశ ఎకానమీ ఎంత ఒడిదుడుకులను ఎదుర్కుందో రూపాయి ప్రయాణాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కాలం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 82 దగ్గర కదులుతోంది.  డాలర్ బలపడుతుండడంతో రూపాయి విలువ పడిపోతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. 

రూపాయి ఇలా..

స్వాతంత్ర్యం రాకముందు రూపాయిని బ్రిటిష్‌‌ పౌండ్‌‌తో లింక్‌‌ చేశారు. దీంతో ట్రేడ్‌‌, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లలో  మన కరెన్సీకి స్టెబిలిటీ వచ్చింది. కానీ, మరోవైపు దేశ ఆర్థిక స్వాతంత్ర్యంపై రిస్ట్రిక్షన్లు నెలకొన్నాయి కూడా. మన ఎకానమీ ఫండమెంటల్స్‌‌పై ఆధారపడకుండా పౌండ్‌‌పై రూపాయి ఆధారపడేది. స్వాతంత్ర్యం వచ్చాక ఫిక్స్డ్‌‌ కరెన్సీ విధానాన్ని రూపాయి ఫాలో అయ్యింది. 1948–1966 మధ్య డాలర్ మారకంలో రూపాయి విలువ 4.79 దగ్గర ఉంది.

1960-70 యుద్ధ ప్రభావం..

1960–70 టైమ్‌‌లో రూపాయి భారీ ఒడిదుడుకులకు లోనైంది.  గ్లోబల్‌‌ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో పాటు, చైనా, పాకిస్తాన్‌‌తో యుద్ధాలు నెలకొనడం రూపాయి విలువను మరింత దిగజార్చాయి. దేశంలో ఇన్‌‌ఫ్లేషన్ గరిష్టాల్లోకి చేరుకోగా, ఫిస్కల్‌‌ డెఫిసిట్ విపరీతంగా పెరిగింది. 1960 లో ఫుడ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ భారీగా తగ్గింది. ఈ టైమ్‌‌లో దేశ ఫారెక్స్ నిల్వలు మొత్తం కరిగిపోయాయి. వీటి దెబ్బకు రూపాయి విలువ దిగజారింది. వరుసగా రెండు  యుద్ధాల కోసం భారీగా ఫారెక్స్ నిల్వలు ఖర్చు చేయడంతో డాలర్ మారకంలో రూపాయి విలువను ప్రభుత్వం తగ్గించాల్సి వచ్చింది. అప్పటి వరకు  4.76 గా ఉన్న రూపాయి విలువను 7.57 కు తగ్గించారు. 1970 లో వచ్చిన గల్ఫ్‌‌ యుద్ధాల కారణంగా రూపాయి విలువ మరింత క్షీణించింది. ఆ టైమ్‌‌లో క్రూడాయిల్‌‌ ధరలు విపరీతంగా పెరగడంతో ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయింది.   దేశ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గిపోయాయి.  

21 వ శతాబ్దం..

2000  వ సంవత్సరం నుంచి  రూపాయి గ్లోబల్‌‌గా విస్తరించడం మొదలయ్యింది. గ్లోబల్‌‌గా ట్రేడవుతున్న కరెన్సీల్లో టాప్‌‌ 15 లో చోటు దక్కించుకుంది. ఇతర దేశాలతో  కరెన్సీ స్వాప్ ట్రాన్సాక్షన్‌‌ అగ్రిమెంట్‌‌లు పెరిగాయి. గ్లోబల్‌‌ స్టేజ్‌‌లో రూపాయికి గుర్తింపు పెరిగింది. కానీ, 2008 లో నెలకొన్న ఫైనాన్షియల్ క్రైసిస్‌‌తో రూపాయికి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. యూఎస్‌‌లో వచ్చిన ఈ సంక్షోభంతో దేశ ఎకానమీ తీవ్రంగా నష్టపోయింది. ఫైనాన్షియల్ క్రైసిస్‌‌  తర్వాత  అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఎంత బలహీనమో అర్థమయ్యింది. డాలర్ మారకంలో రూపాయి విలువ దిగజారింది.2010 లో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో రూపాయి విలువ మరింత పడింది. రెసిషన్‌‌ నుంచి ఆర్థిక వ్యవస్థ సక్సెస్‌‌ఫుల్‌‌గా బయటపడినప్పటికీ ఇన్‌‌ఫ్లేషన్‌‌, ట్రేడ్ డెఫిసిట్‌‌, జియోపొలిటికల్ కారణాలతో   రూపాయి విలువ ఇంకా పడిందే తప్ప బలపడలేదు.  ఎవరూ ఊహించని టైమ్‌‌లో 2020 లో కరోనా సంక్షోభం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్టింది. మిగిలిన దేశాల కరెన్సీల మాదిరే మన కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. కానీ, లోకల్ ఎకానమీ బలంగా ఉండడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రూపాయి  అంచనాల కంటే తొందరగానే  కుదురుకుంది. రూపాయిని  బలపరిచేందుకు వివిధ ఫైనాన్షియల్ రిఫార్మ్స్‌‌ను ప్రభుత్వం తీసుకొంది. రిస్క్ మేనేజ్‌‌మెంట్‌‌ కోసం కరెన్సీ ఫ్యూచర్స్‌‌ అండ్  ఆప్షన్స్‌‌ను తెచ్చింది. వివిధ  దేశాలతో రూపాయిల్లో ట్రేడ్‌‌ చేయడానికి 18 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 

టర్నింగ్ పాయింట్‌‌ 1990 లో..

దేశ ఆర్థిక పరిస్థితులు  1990 తర్వాత మారాయి. ప్రభుత్వం ప్రైవేటేజేషన్‌‌కు, లిబరలైజేషన్‌‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో  విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించడానికి  రూపాయి విలువను  తగ్గించక తప్పలేదు. దేశంలో అప్పుడు ఇన్‌‌ఫ్లేషన్ గరిష్టాల్లో ఉండగా, జీడీపీ గ్రోత్ చాలా తక్కువగా రికార్డయ్యింది. ఫారెక్స్ నిల్వలు  మూడు వారాల దిగుమతులకు కూడా సరిపోయే స్టేజ్‌‌లో లేవు.  ఆ టైమ్‌‌లో డాలర్ మారకంలో రూపాయి విలువను 24.5 కు తగ్గించారు. 1990 జులై 1 న మొదటిసారిగా రూపాయి విలువను 7–9 శాతం తగ్గించగా, రెండోసారి జులై 3 న 11 శాతం తగ్గించారు. గ్లోబల్‌‌గా ఆర్థిక పరిస్థితులు  అధ్వాన్నంగా మారడం, వాణిజ్య లోటు , ఆయిల్ ధరల్లో మార్పులు కారణంగా  ఆ తర్వాత ఏడాది రూపాయి కదలికల్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. కరెన్సీ స్వాప్స్‌‌, ఫారెక్స్ రిజర్వ్‌‌లను మేనేజ్‌‌ చేయడం వంటి విధానాలతో  రూపాయి కదలికల్లో ఒడిదుడుకులు తగ్గించడానికి  రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌‌‌బీఐ) ముందుకొచ్చింది. టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో  ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న బ్యాంక్ నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. డిజిటల్ ఎకానమీకి ఈ టైమ్‌‌లోనే పునాదులు పడ్డాయి.