
- వడ్ల కొనుగోలు రికన్సిలేషన్ డబ్బులు తీసుకుంటున్న వైనం
- రూ. వేలల్లో వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్న ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు
జనగామ, వెలుగు: ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల వడ్ల కొనుగోలు రికన్సిలేషన్ చేసేందుకు జనగామ సివిల్సప్లై ఆఫీస్సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో యాసంగి సీజన్లో సుమారు 160 ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లను కొనుగోలు చేయగా.. వాటి నిర్వాహకుల వివరాల రికన్సిలేషన్ను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. రికన్సిలేషన్ పూర్తైతేనే క్వింటాలుకు రూ. 32 కమీషన్ డబ్బులు ఐకేపీ సెంటర్ల నిర్వాహకులకు అందుతాయి. దీంతో సివిల్సప్లై ఆఫీస్ సిబ్బంది బలవంతపు వసూళ్లకు తెరలేపారు.
ఆపరేటర్కు రూ. 1000, అటెండర్ కు రూ .100 నుంచి రూ. 200 ఇవ్వనిదే రికన్సిలేషన్చేయడం లేదు. ప్రతి సెంటర్ నుంచి రూ. వెయ్యికి పైగానే డబ్బులు తీసుకుంటున్నట్టు ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలా బలవంతపు వసూళ్లు చేయలేదని పేర్కొంటున్నారు. కొందరు డబ్బులను ఫోన్ పే ద్వారా చెల్లించగా, ఇంకొందరు నగదుగా ఇచ్చినట్లు చెప్పారు.
సిబ్బంది అవినీతిని అరికట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. దీనిపై జనగామ సివిల్ సప్లై డీఎం వి. హథీరామ్ను వివరణ కోరగా.. రికన్సిలేషన్కు ఒక్కో సెంటర్నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.