
- రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలకు పైనే
- ఇండ్ల స్థలాల పంపిణీని పూర్తిగా పక్కనపెట్టేసిన ప్రభుత్వం
- జాగాలు ఇవ్వాలని పోరాటానికి దిగుతున్న పేదలు
- ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్న గుడిసెలు
కరీంనగర్, వెలుగు:ఖజానా నింపుకునేందుకు కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదలకు ఇండ్ల స్థలాలు మాత్రం పంపిణీ చేయడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న కొందరు పేదలకు తప్ప.. గత తొమ్మిదేండ్లలో ఎక్కడా ప్రభుత్వం చొరవ తీసుకొని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని తొమ్మిదేండ్లుగా ఊరిస్తూ.. పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేసింది. సొంత జాగాలో ఇండ్లు కట్టుకునేటోళ్లకు రూ.3 లక్షల సాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అసలు జాగాలే లేని తమ పరిస్థితి ఏమిటని పేదలు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తున్నారు.
గత ఏడాది కాలంగా లెఫ్ట్, ఇతర పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో ఎక్కడ గుడిసెలు వేసినా వేలాది మంది తరలివస్తున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసినా, కేసులు పెట్టినా, భూకబ్జాదారులు గుడిసెలు తగులబెట్టినా.. బెదరకుండా 60 గజాల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఐదేండ్లకు ఒకసారైనా పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసేవారని, బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడి తొమ్మిదేండ్లయినా ఎక్కడా పట్టాలు ఇవ్వలేదని పేదలు మండిపడుతున్నారు.
లక్షలాది మంది అద్దె ఇండ్లలోనే..
తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014లో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో సొంతిల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటున్న కుటుంబాల సంఖ్య 24,58,381. గుడిసెలు, రేకులు, డేరాలా లాంటివి వేసుకొని తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న కుటుంబాలు 3,24,312. ఈ తొమ్మిదేండ్లలో ఇండ్లు లేని కుటుంబాల సంఖ్య 30 లక్షలు దాటి ఉంటుందని అంచనా. సొంత జాగలో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ దాన్ని ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గించింది. అయితే ఎక్కడో ఒక చోట కొద్దిగా ఇంటి స్థలం ఉన్నోళ్లకు ఈ స్కీమ్ పనికొస్తుందని, అసలే స్థలం లేని తమ పరిస్థితి ఏమిటని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇండ్ల భూములకు మస్తు ధర..
ప్రస్తుతం రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇండ్లు కట్టుకునేందుకు అనువైన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ధర కనీసం గజం రూ.7 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు పలుకుతోంది. పట్టణాలకు, సిటీకి ఎంత దూరంలో కొన్నా 80 గజాల చిన్న ప్లాట్కు రూ.5 లక్షలకు పైనే అవుతోంది. ఇలాంటి తక్కువ ధర ప్లాట్లను అప్పోసప్పో చేసి కొన్నా.. అక్కడున్న సౌకర్యాల దృష్ట్యా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కూలీనాలీ చేసుకొని బతికే కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది.
గుడిసెల పోరాటానికి వేలాదిగా జనం..
రాష్ట్రంలో చాలా ఏండ్ల తర్వాత లెఫ్ట్ పార్టీలు ఖాళీగా ఉన్న సర్కార్ భూముల్లో పేదలతో గుడిసెలు వేయిస్తున్నాయి. ఇండ్ల స్థలాల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. అధికార బీఆర్ఎస్ తో సఖ్యతగా ఉంటూనే పేదల ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్నాయి. ఆయా పార్టీలు ఎక్కడ గుడిసెలు వేసినా వేలాది మంది పేదలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులతో పాటు గుడిసెలు వేసిన పేదలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల సర్కార్ స్థలాలపై కన్నేసిన కబ్జాదారులు.. గుడిసెలు వేసుకున్న పేదలపై దాడులు చేస్తూ, గుడిసెలను రాత్రికి రాత్రే తగులబెడుతున్నారు. మరికొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీల నేతలపై దాడులకు దిగుతున్నారు.
వరుసపెట్టి సర్కార్ భూముల అమ్మకం..
రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని విలువైన భూముల అమ్మకాన్ని స్పీడప్ చేసింది. తొలుత ఉప్పల్ భగాయత్, కోకాపేటలో భూములను హెచ్ఎండీఏ విక్రయించగా.. ఖానామెట్, పుప్పాలగూడలో భూములను టీఎస్ఐఐసీ ద్వారా అమ్మింది. కోకాపేటలోని 49 ఎకరాలకు రూ.2,200 కోట్లు, ఖానామెట్లో 15 ఎకరాలకు రూ.730 కోట్లు, ఉప్పల్ భగాయత్లో 39 ఓపెన్ ప్లాట్లకు రూ.474 కోట్ల ఆదాయం సమకూరింది. వేలానికి స్పందన బాగుండడంతో కరీంనగర్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నల్గొండ, కామారెడ్డి, పెద్దపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోనూ రాజీవ్ స్వగృహ, ప్రభుత్వ భూములను వేలం వేసి వందల కోట్ల రూపాయలు రాబట్టింది. ఇంకా వేలం వేసి అమ్మేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2023–24 బడ్జెట్ లో భూముల అమ్మకం లాంటి పన్నేతర ఆదాయం ద్వారానే రూ.22,808 కోట్లు రాబట్టాలని సర్కార్ అంచనా వేసిందంటే.. ఈ ఏడాది భూముల వేలం ఏ స్థాయిలో ఉండనుందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని కొన్ని భూ పోరాటాలు..
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో 126 సర్వే నంబర్ లోని సర్కార్ భూమిలో ఐదేండ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గుడిసెలు వేసినప్పుడల్లా తొలగించి కేసులు నమోదు చేస్తున్నారు. నిరుడు సెప్టెంబర్ 5న గుడిసెలు వేసినప్పుడు ఎమ్మార్వో వచ్చి పది రోజుల్లో సమస్య పరిష్కారిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికీ ఎలాంటి హామీ రాకపోవడంతో పేదలు తిరిగి అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల బట్టిసావర్ గామ్ శివారులోని సర్వే నంబర్ 72లో గుడిసెలు వేసుకొని ఉంటున్న ఆదివాసీలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 2007 నుంచి 2013 వరకు ఇక్కడ పేదలు నివాసం ఉండగా.. 2014లో గుడిసెలు తొలగించారు. ఈ సర్వే నంబర్ లోని భూమిని కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసుకుంటున్నట్లు తెలియడంతో ఆదివాసీ సంఘాల నాయకులు ఆ భూమిని పేదలకు మాత్రమే పంపిణీ చేయాలని నెల రోజులుగా దీక్షలు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో జంబిగద్దె వద్ద సర్వే నంబర్ 922, 923లోని 47 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు కేటాయించాలని సీపీఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. గత 9 రోజులుగా 1,200 మంది పేదలు ఆందోళన చేస్తున్నారు. అక్కడ తాత్కాలిక గుడిసెలు వేసుకొని 100 గజాల జాగా ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అధికారులు, పోలీసులు వచ్చి గుడిసెలు తీసివేశారు. సీపీఎం నాయకులపై కేసులు పెట్టారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సీపీఎం ఆధ్వర్యంలో మార్చిలో వేలాది మంది నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. గోదావరిఖని గంగానగర్ సమీపంలోని జనగామ, మల్కాపూర్ శివారులోని 36, 37, 38, 814 సర్వే నంబర్లో 43 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సుమారు రెండు వేల మంది పేదలు తరలివచ్చి పాత చీరలు, కర్రలతో తమ హద్దులు పెట్టుకున్నారు. అలాగే ఎన్టీపీసీ ఏరియాలోని మేడిపల్లి, మల్కాపూర్ శివారులోని 17/ఏ, 17/బి సర్వే నెంబర్లో ఉన్న 8 ఎకరాల్లో, ఇందిరమ్మ కాలనీ పక్కనున్న 610, 611, 612 సర్వే నంబర్లోని 6 ఎకరాల్లో, పీకే రామయ్య కాలనీ పక్కనున్న 617 సర్వే నంబర్లోని 7 ఎకరాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతగా.. ప్రతిరోజు వందలాది మంది పేదలు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి హెచ్చరించినా కదలడం లేదు. జనగామ జిల్లా కేంద్రం శివారు నెల్లుట్ల వద్ద 464, 465, 466 సర్వే నంబర్లలో సుమారు 7 ఎకరాల సర్కారు భూమిలో వేలాది మంది పేదలు సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు. నిరుడు డిసెంబర్ 17 నుంచి అక్కడే ఉంటున్నారు. ఇటీవల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గుడిసెలను సందర్శించి, సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయించారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదలు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో అనేక చోట్ల గుడిసెలు వేసుకున్నారు. నిరుడు ఖిలా వరంగల్, మట్టెవాడ శివారు నిమ్మాయి చెరువు, జక్కలొద్ది, బొల్లికుంట, గుండ్లసింగారం, గోపాల్పూర్ ఊర చెరువు, దర్గా కాజీపేట రోడ్, మడికొండ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లో వేలాది మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోనూ వందలాది మంది పేదలు సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు.
ఏండ్ల సంది గుడిసెల్లోనే..
ఈమె పేరు కంది అనూష. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరించే ఈమె.. తన భర్త, పిల్లలతో హౌసింగ్ బోర్డు కాలనీలోని సమ్మక్క గద్దెల వద్ద ఆరేండ్లుగా గుడిసె వేసుకొని ఉంటోంది. వీళ్లతో పాటు మరో 15 కుటుంబాలు ఇక్కడే గుడిసెల్లో నివసిస్తున్నాయి. అంతకుముందు బొమ్మకల్ లో రెండేండ్లు ఉండగా, గుడిసెలు ఖాళీ చేయించడంతో సమ్మక్క గద్దెల వద్దకు వచ్చారు. వీళ్లంతా కిరాయిలు కట్టే ఆర్థిక స్తోమత లేక, ఉండడానికి ఇండ్లు లేక ప్రభుత్వ స్థలంలో అట్టలతో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. తమకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు.
పట్టాలిచ్చేదాకా కదలం..
72 సర్వే నంబర్ లో దాదాపు 460 ఎకరాలను కొంతమంది రియల్ స్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, రెవెన్యూశాఖ అధికారులు కలిసి కబ్జా చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు. ఈ సర్వే నంబర్ లో అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమిని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ పేదలకు ఇవ్వాలి. గతంలో ఉన్న వారికే ఇక్కడ ఇండ్ల స్థలాలు కేటాయించాలి. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం ఆగదు.
- గొడం గణేశ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
100 గజాలు ఇవ్వాలి
కోరుట్ల జంబిగద్దె వద్ద ప్రభుత్వ స్థలంలో పేదలకు 100 గజాలు ఇవ్వాలి. గుడిసెలు వేసుకున్నోళ్లంత పేదలే. అధికారులు సహకరించి పట్టాలు మంజూరు చేయాలి. పేదల ఇండ్ల కోసం సీపీఎం పోరాడుతోంది. కేసుల పేరుతో పేదలను ఇబ్బంది పెట్టొద్దు.
- రజియా, కోరుట్ల కిరాయి ఎల్తలేదు
మాది నిరుపేద కుటుంబం. గత 15 ఏండ్లుగా కిరాయికే ఉంటున్నం. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తే వచ్చే రూ.10 వేలలో ఇంటి కిరాయికే ఎక్కువ కట్టాల్సి వస్తున్నది. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. సీపీఎం నిర్వహించిన భూ పోరాటంలో గంగానగర్లో ఇంటి స్థలం కోసం జాగను ఆక్రమించుకున్నం. ప్రభుత్వం మాకు ఈ జాగలను ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం కూడా ఆర్థిక సాయం చేయాలి.
‒ ఆర్.మాధవి, లెనిన్ నగర్, గోదావరిఖని