హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు. కేసీఆర్ ను సమర్ధించి తప్పు చేశానని.. దళితబంధు అమలు కాకుంటే చచ్చిపోతానని గతంలో చెప్పానన్నారు. పథకం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో.. చనిపోవాలంటూ దళిత యువత తనకు మెస్సెజ్ లు పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ముహుర్తం పెడితే పురుగుల మందు తాగి చనిపోతానన్నారు మోత్కుపల్లి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందని.. కలిసి కట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తుంగతుర్తి సీటు ఇస్తే..గెలుస్తానని చెప్పారు. బలహీన అభ్యర్థికి ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఉందన్నారు.
దళితబంధు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని..ఇచ్చిన వాటిలో కూడా సగానికి పైగా ఎమ్మెల్యేలే తిన్నారని ఆరోపించారు మోత్కుపల్లి. ఇదే విషయం కేసీఆరే చెప్పారని..అయినా మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ కేవలం హుజురాబాద్ ఎన్నిక కోసం దళితబంధు ప్రవేశ పెట్టారని అన్నారు.
ఏపీలో మూడు పార్టీలు కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నాయని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని.. ఆయనక ఏమైనా అయితే జగన్ , కేసీఆర్, బీజేపీలదే బాధ్యత అని అన్నారు. ఎదురు మాట్లాడితే ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతారా? అని ప్రశ్నించారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వేధింపులు చూడలేదన్నారు.దుర్మార్గమైన ఆలోచన మంచిది కాదనని.. ఇప్పటికైనా మారాలన్నారు.