కొత్తగూడెం కార్పొరేషన్​లో డివిజన్ల లొల్లి!

కొత్తగూడెం కార్పొరేషన్​లో   డివిజన్ల లొల్లి!
  • అశాస్త్రీయంగా విభజించారంటూ కాంగ్రెస్​ లీడర్ల ఆగ్రహం
  • సీపీఐ నేతలు చెప్పినట్లు ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణ 
  •  విషయాన్ని ఇప్పటికే మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన స్థానిక నేతలు 
  •  మిగతా మంత్రులు, కలెక్టర్​కూ కంప్లైంట్​ ఇచ్చేందకు సిద్ధమవుతున్న నాయకులు 
  •  ముసాయిదా కాపీని నోటీస్​బోర్డులో ఒక్కరోజుకు మించి ఉంచలే.. 
  •  ఏ ఇల్లు ఏ డివిజన్​ లోకి వచ్చేదెలా తెలుసుకోవాలని స్థానికులు ఫైర్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం కార్పొరేషన్​లో డివిజన్ల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. డివిజన్ల ఏర్పాటు విషయమై స్థానికంగా అధికారంలో ఉన్న సీపీఐ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. డివిజన్ల విభజనలో ఆఫీసర్లు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్​ లీడర్లు ఫైర్​అవుతున్నారు. అశాస్త్రీయంగా డివిజన్లను ఏర్పాటు చేశారనిఆరోపిస్తున్నారు. అభ్యంతరాలు ఎక్కడ తీసుకుంటారు, ఎవరికి ఇవ్వాలి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇవ్వాలి అనే అంశాలపై కార్పొరేషన్​ అధికారులు ప్రచారం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

అంతా ఆ నేతల కనుసన్నల్లోనే..!

కార్పొరేషన్​ ఆఫీసర్లు సీపీఐ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని పలువురు కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. వార్డులలోని ఓటర్లను ఇష్టమున్నట్టుగా మార్చుతూ అంతా  సీపీఐ నేతల కనుసన్నల్లోనే జరిగిందంటూ ఆయా పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై శుక్రవారం పలువురు కాంగ్రెస్​ నేతలు మీటింగ్​పెట్టుకున్నారు. కొత్తగూడెం పట్టణంలోని కాంగ్రెస్​తో పాటు బీఆర్​ఎస్​ మాజీ కౌన్సిలర్ల వార్డులను అడ్డగోలుగా విభజించారని అంటున్నారు. కాగా, డివిజన్ల ఏర్పాటులో తమకు ఎటువంటి సంబంధం లేదని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. సీపీఐ, కాంగ్రెస్​ నేతల మధ్య సోషల్​మీడియాలో మాటల యుద్ధం 
కొనసాగుతోంది. 

మొత్తం గోప్యంగానే.. 

కొత్తగూడెం కార్పొరేషన్​లో 60డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఈ నెల 4న ముసాయిదాను ఆఫీసర్లు రిలీజ్​ చేశారు. ముసాయిదా కాపీని కొత్తగూడెం కార్పొరేషన్ ఆఫీస్​లో ఏర్పాటు చేశారు. కానీ ఆ కాపీ నోటీస్​ బోర్డులో ఒక్కరోజుకు మించి పెట్టలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోటీస్​ బోర్డులో డివిజన్​ కాపీలు లేకపోవడంతో ఏ డివిజన్​ పరిధి ఎక్కడి వరకు ఉంది, ఏ ఇంటి నెంబర్​ ఏ డివిజన్​ పరిధిలోకి వచ్చిందనే వివరాలు తమకు ఎలా తెలుస్తాయని ప్రజలు ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్నారు. అలాగే డివిజన్లకు సంబంధించి అభ్యంతరాలను ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇవ్వాలి, ఎక్కడ, ఎవరికి ఇవ్వాలి అనే విషయమై కార్పొరేషన్​ ఆఫీసర్లు కనీసం ప్రచారం చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మంత్రులు, కలెక్టర్ ​దృష్టికి.. 

కార్పొరేషన్​లో డివిజన్ల ఏర్పాటుతో పాటు కమిషనర్​ వన్​ సైడ్​గా వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్​ పార్టీ నేతలు మంత్రులు, కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పలువురు నేతలు కంప్లైంట్​ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, కలెక్టర్​కు కూడా ఫిర్యాదు చేస్తామని పలువురు నేతలు పేర్కొంటున్నారు.