
- టైమ్ వచ్చినపుడు అన్నీ బయటపెడ్తం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
- 100 సీట్లు కాదు.. ముందు మీ మామ, బావ, మరదలితో పంచాయితీ తేల్చుకో
- పదేండ్ల మీ పాలన, 17 నెలల మా పాలనపై చర్చకు రావాలని హరీశ్కు సవాల్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చాక శామీర్ పేటలోని ఓ ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ భేటీపై తమకు పక్కా సమాచారం ఉందని, టైమ్ వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయటపెడ్తామన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని హరీశ్అంటుండు.. అసలు వచ్చే ఎన్నికల్లో మీకు బీఫామ్ వస్తదో, రాదో చూసుకోండి.
బీజేపీతో మీ పార్టీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని కవిత అంటోంది. ముందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పు. మీ మామ, బావ, మరదలితో ఉన్న పంచాయితీని ముందు తేల్చుకో హరీశ్’ అంటూ చురకలు అంటించారు. అలాగే, బీజేపీ నుంచి బీఆర్ఎస్కు ముడుపులు అందాయని రాజాసింగ్ అన్న మాటలకూ సమాధానం చెప్పాలన్నారు. ఆ రెండు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉందన్న సంగతి కవిత, రాజాసింగ్ మాటలతో తేటతెల్లం అయ్యిందన్నారు.
వాటిని కప్పి పుచ్చుకోవడానికే సీఎం రేవంత్ పై హరీశ్విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి పదేండ్ల పాలన, తమ 17 నెలల పాలనపై చర్చకు సిద్ధంగా ఉండాలని హరీశ్కు మహేశ్గౌడ్ సవాల్విసిరారు. ‘కేసీఆర్ ఉద్యమంలో ఒక భాగం అంటే ఒప్పుకుంటాం. కానీ, మీకున్న రెండు పార్లమెంట్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం రాలేదు. మా కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది’ అని ఆయన స్పష్టంచేశారు. కాంట్రాక్టర్ల కోసం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడ్తే.. ఆ బీటలువారిన ప్రాజెక్టును తాము రిపేర్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.
పీసీసీ కమిటీల్లో మహిళలకు చోటు
పీసీసీలో, ప్రభుత్వ పదవుల్లో మహిళా నేతలు, కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మహేశ్గౌడ్మాట్లాడుతూ.. కష్టపడే వాళ్లకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా వేటు తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఓపిక ఉండాలని, పీఏసీ కమిటీలో అన్ని కులాల వారికి సముచిత స్థానం లభించిందని, మిగతా కమిటీల్లో కూడా చోటు కల్పిస్తామన్నారు.
గాంధీభవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్ పార్క్లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను ఆయన గుర్తుచేసుకుంటూ.. వారి ఆదర్శాలు యువతకు ప్రేరణగా నిలవాలని వ్యాఖ్యానించారు. ఆరు దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించిందని, ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. గాంధీ భవన్ లో సేవాదల్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అమీర్ అలీఖాన్, బల్మూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం అంటే ఒప్పుకుంటాం. కానీ, మీకున్న రెండు పార్లమెంట్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం రాలేదు. మా కాంగ్రెస్ ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది.కాంట్రాక్టర్ల కోసం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడ్తే.. ఆ బీటలు వారిన ప్రాజెక్టును మేం రిపేర్ చేస్తున్నాం.- మహేశ్ కుమార్ గౌడ్