
బెల్లంపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణం 13వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించి, ఇండ్లకు ముగ్గు వేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అర్హులందరికీ ఇండ్లు ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు.
ఈసెట్ కౌన్సెలింగ్ షురూ
పాలిటెక్నిక్ కాలేజీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వినోద్ అన్నారు. బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం ఈసెట్ కౌన్సెలింగ్ను ఆయన ప్రారంభించారు. మైనింగ్ ఇంజినీరింగ్ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కె.అక్షయ, 4వ ర్యాంకర్ వి.మారుతి సాయిని ప్రశంసించారు. టాప్ ర్యాంకులు సాధించిన 20 మందిని, వివిధ సెమిస్టర్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు.
కంప్యూటర్, స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్లను పరిశీలించిన ఎమ్మెల్యే.. ప్రస్తుతమున్న 30 కంప్యూటర్లు ఉండగా వాటి సంఖ్యను 60కి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్, కాలేజీ భవనాలకు పెయింటింగ్, ల్యాబ్ విస్తరణ, ఆడిటోరియం నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఆర్డీవో హరికృష్ణ, కాంగ్రెస్ నేతలు కేవీ ప్రతాప్, ముచ్చర్ల మల్లయ్య, దావ రమేశ్ బాబు, కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.