
- 40 ఏండ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నం
- అధికారంలో ఉన్నా లేకున్నా అండగా ఉంటం
- కాకా బ్రాండ్ను చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదు
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఎంపీ వంశీకృష్ణ ఏడాది పదవీకాలం పూర్తయిన సందర్భంగా మందమర్రిలో సంబురాలు
కోల్బెల్ట్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ప్రాంత ప్రజలు నలభై ఏండ్లుగా కాకా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ నుంచి వెంకటస్వామి, నేను, వంశీకృష్ణ ఎంపీలుగా గెలిచాం. చెన్నూరులో నేను, బెల్లంపల్లిలో అన్న వినోద్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించాం. ఈ ప్రాంతానికి కాకా కుటుంబంతో వీడదీయలేని బంధం ఉందనడానికి ఇదే నిదర్శనం..”అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ చౌరస్తా లో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్నేత బండి సదానందం యాదవ్ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి పాల్గొని కేక్ కట్ చేసి ఎంపీ వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకా కుటుంబం ఆస్తులు పెంచుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిందన్నారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుస్తాడని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందని, కొందరు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ ప్రాంతంపై కాకా బ్రాండ్ ఉందని, దాన్ని తుడిచివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కాకా వెంకటస్వామి, మలి దశలో తాను ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామన్నారు. కాకా కుటుంబం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తుందన్నారు. ఏడాదిలో వందల కోట్లు మంజూరు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఏడాదిలో వందల కోట్ల ఫండ్స్ను తీసుకొచ్చారన్నారు. రూ.100 కోట్లతో నేషనల్ హైవే కొత్త ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి ఫండ్స్శాంక్షన్ చేయించినట్లు చెప్పారు. ప్రజల నాడీని తెలుసుకొని ముందుకు సాగాలని ఎంపీకి సూచించారు.
సంబురాల్లో కళాకారులు ఆటపాట హుషారెత్తించాయి. చెన్నూరు ఎమ్మెల్యే కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కమిషనర్ మురళీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. అంతకు ముందు లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన మాజీ జెడ్పీటీసీ ముత్తె సత్తయ్య, -బానమ్మ దంపతుల ఇంటిని సందర్శించారు. కాబోయే వరుడిని ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రతాప్ ఉన్నారు.